షాబాద్, ఫిబ్రవరి 26 : చేవెళ్లలో మంగళవారం జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యక్రమంలో జిల్లా అధికారులంతా సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. ముఖ్యమంత్రి చేవెళ్ల పర్యటన సందర్భంగా సోమవారం కలెక్టర్ చేవెళ్ల ఫరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో చేవెళ్ల పట్టణానికి చేరుకుని హెలిప్యాడ్ నుంచి నేరుగా ఫరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చేరుకుని, ఆరు గ్యారంటీల అమలులో భాగంగా 200 యూనిట్లు వరకు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ ప్రారంభించే కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే దాకా ఎవరెవరికి అప్పగించిన బాధ్యతలను వాళ్లు సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఎక్కడా చిన్న పొరపాటు జరుగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. అవసరమైతే సోమవారం రాత్రి వరకు స్టాల్స్ను ఏర్పాటు చేసుకోవాలని డీఆర్డీఏ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కలెక్టర్ శశాంక హెలిప్యాడ్, స్టేజీ, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో సాయిరాం, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో రంగారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.