రంగారెడ్డి, మార్చి 21(నమస్తే తెలంగాణ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన జిల్లా స్థాయి బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. ఎవరైనా లక్ష రూపాయలకుపైగా డబ్బుల లావాదేవీలు జరిపితే కచ్చితంగా వివరాలు తెలియజేయాలన్నారు.
జిల్లాలో ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు వచ్చే సెక్యూరిటీ వ్యాన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏజెన్సీలు పెద్ద మొత్తంలో డబ్బులు తరలించాలంటే తెలంగాణ సీఈవో నుంచి అనుమతి పొందాలన్నారు. లాకర్లలోని గోల్డ్ను పర్యవేక్షించాలని, క్యాష్ జనరేట్ చేసేందుకు క్యూఆర్కోడ్ను ఉపయోగించాలన్నారు.
వాహనాల నంబర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ..అలాగే ప్రతిరోజూ క్యాష్ డిపాజిట్ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాల కోసం కొత్త బ్యాంకు ఖాతాను తెరవాలన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను ఎపిక్ కార్డులతో కూడిన పూర్తి సమాచారం అందజేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఈవో సంగీత, ఎల్డీఎం కుసుమ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఎలక్షన్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.