రంగారెడ్డి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో బాధ్యతగా నిర్వర్తించాలని, ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించే రాజేంద్రనగర్ నియోజకవర్గ సిబ్బందికి రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, శేరిలింగంపల్లి నియోజకవర్గ సిబ్బందికి మాదాపూర్ శ్రీవెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజ్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం నిర్వహించిన శిక్షణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల రోజున విధులను నిర్వర్తించడంపై ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పీవో డైరీ, 17సీ పై పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు.
పోలింగ్ రోజున అవసరమయ్యే కవర్లో సరైన సమాచారాన్ని నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి వీవీ ప్యాట్లలో ఉండే స్లిప్లను ప్రత్యేక కవర్లో ఉంచాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం కోసం ఫామ్-12ను తప్పనిసరిగా నింపి సమర్పించాలని సూచించారు. పీవోలు, ఏపీవోలకు మూడు సార్లు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు.
ఏవైనా సమస్యలుంటే సెక్టోరియల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. బూత్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్పై సీల్ వేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, రాజేంద్ర నగర్ ఏఆర్ఓ వెంకట రెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ, ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అత్యవసర సర్వీసులకు చెందిన వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అత్యవసర శాఖల పరిధిలోకి వచ్చే వివిధ శాఖల నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హకు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ వెసులుబాటు కల్పించిందన్నారు.
పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడని వారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని నోడల్ అధికారులకు సూచించారు. ఏప్రిల్ 20వ తేదీ లోపు సమర్పించే ఫారం -12(డీ)లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఫారం -12 (డీ) దరఖాస్తులను నోడల్ అధికారి నుంచి లేదా ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుంచి పొందవచ్చని సూచించారు. ఎలక్షన్ కమిషన్ పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఆర్వో కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు.
ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మే 13న జరిగే పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం కల్పించబడదన్నారు. ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మారింగ్ చేయబడుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, నోడల్ అధికారి కృష్ణా రెడ్డి, చేవెళ్ళ ఏఆర్వో సాయిరాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీఇందు కళాశాలలో పీవోలు, ఏపీవోలు, ఇతర ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.