రంగారెడ్డి, మార్చి 28(నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమష్టిగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా ఇంటలిజెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో వ్యయ నియంత్రణ ప్రధాన అంశమని, ప్రతి ఖర్చునూ లెకించాల్సి ఉంటుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, కానుకలు, మత్తు పదార్థాలు తదితర వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ఇందుకు నియమించిన ఫ్ల్లయింగ్ స్వాడ్, వీడియో సర్వేలైన్స్, స్టాటిస్టికల్ సర్వేలైన్స్, వీడియో వీనింగ్ బృందాలు సమర్థ్ధవంతంగా పని చేయాలని కోరారు. జిల్లాలో ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా ఇప్పటివరకు రూ.79,41,650 నగదు, రూ.4,18,700 విలువైన 5.30 కిలోల సిల్వర్, రూ.37,53,050.5 విలువ గల 5822.53 లీటర్ల మద్యం, రూ. 3,03,25,575 విలువగల 716.925 కిలోల డ్రగ్స్, నారోటిక్స్ను సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఆబారీ, రవాణా, వాణిజ్య పన్నులు తదితర శాఖల సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.
రూ. 10 లక్షలు పైగా డబ్బు పట్టుబడిన సందర్భంలో ఆదాయ పన్ను శాఖ అధికారులకు తప్పనిసరిగా సమాచారం అందించాలన్నారు. బ్యాంకు లావాదేవీలపై ప్రతి రోజూ నివేదిక అందించాలన్నారు. అక్రమ మద్యం నిల్వలు, మద్యం రవాణాపై దాడులు నిర్వహించాలని ఆబారీ అధికారులకు సూచించారు. గత శాసనసభ ఎన్నికల్లో మాదిరే ఈ ఎన్నికల్లోనూ అధికారులు సమష్టిగా కృషి చేస్తూ అక్రమ డబ్బు, మద్యం, కానుకలను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్వో సంగీత, ఎన్ ఫోర్స్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.