వికారాబాద్, ఏప్రిల్ 8 : పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని సెయింట్ జూడ్స్ స్కూల్లోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, తాగునీటి వసతి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారా అని చీఫ్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం లోకి సెల్ఫోన్లను అనుమతించొద్దని సూచించారు. అదేవిధంగా సెయింట్ ఆంథోని ఉన్నత పాఠశాలలోని ఎగ్జామ్ సెంటర్ను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్కు సూచించారు. వారి వెంట ఎంపీడీవో సత్తయ్య, చీఫ్ సూపరింటెండెంట్ రామిరెడ్డి, అధికారులు ఉన్నారు.
గణితం పరీక్షకు 74 మంది గైర్హాజరు
బొంరాస్పేట, ఏప్రిల్ 8 : టెన్త్ వార్షిక పరీక్షలు వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు, విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శనివారం జరిగిన గణితం పరీక్షకు జిల్లాలో 74 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 13,456 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో 13,394 మంది హాజరు కాగా 62 మంది గైర్హాజరయ్యారు.
అదేవిధంగా ఫెయిలైన విద్యార్థుల్లో మొత్తం 63 మందిలో 51 మంది హాజరు కాగా 12 మంది పరీక్ష రాయలేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తహసీల్దార్ షర్మిల, ఎంపీడీవో పాండు, డీటీ రవి సందర్శించి పరిశీలించారు.