వికారాబాద్, ఫిబ్రవరి 14 : వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగుల సదరం క్యాంపునకు సంబంధించి ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈనెల 19, 20, 23, 26, 27, మార్చి 08, 09, 16, 19, 30 తేదీల్లో తాండూరు ప్రభుత్వ దవాఖానలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు, బుద్ధి మాంద్యం, చెవుడు మూగ ఉన్న దరఖాస్తుదారులు హాజరుకావాలన్నారు. ఈనెల 20, 21, 23, 27, మార్చి 06, 22, 26, 27 తేదీల్లో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించే క్యాంపులకు అంగ వైకల్యం, అంధులు హాజరుకావాలన్నారు. ఈ క్యాంపులకు సదరం సర్టిఫికెట్ పొంది సర్టిఫికెట్ కాల పరిమితి అయి పోయిన వారితో పాటు, కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న వారు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.