వికారాబాద్, మార్చి 20 : జిల్లాలో జరిగే పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు బాధ్యతతో పని చేయాలని, వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను సూచించారు. బుధవారం ఐడీవోసీ సమావేశపు హాలులో సెక్టోరల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలైన్స్, వీడియో వీవింగ్ సర్వేలైన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 16న విడుదల అయినందున.. అప్పటి నుంచి జూన్ 6 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్, నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. జిల్లా అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు, సెక్టోరల్, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలైన్స్ టీం బాధ్యతలను తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తిస్తుందని తెలిపారు. జిల్లాలో 6 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, ఎస్ఎస్టీ 6, మూడు షిఫ్టులలో 24/7 పర్యవేక్షణ చేస్తుంటాయని తెలిపారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నిఘా బృందాలు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధుల నిర్వహణ చేయాలన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా కేటాయించిన బృందాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఆర్వోలు నిఘా బృందాల పర్యవేక్షణ చేయాలన్నారు. ఏఆర్వోలు, పోలీస్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలపరంగా, భద్రతాపరంగా చేపట్టాల్సిన చర్యల గురించి కార్యాచరణ చేయాలన్నారు. మీ పరిధిలో పర్మిషన్ లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు జరగడానికి వీలు లేదన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాంగులకు హోం ఓటింగ్ నిమిత్తం ఫారం-12డిలను ఇంటింటికీ అందజేసి రసీదు తీసుకోవాలన్నారు.
ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సెక్టోరల్ అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి పోలీస్, రెవెన్యూ సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్రమ నగదు, లిక్కర్, ప్రలోభాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 6 ఎఫ్ఎస్టీ, 6 ఎస్ఎస్టీ, 2 టీములు ఏర్పాటు చేసినట్లు, 24 గంటల నిఘా ఉంచినట్లు తెలిపారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రజలతో మర్యాదగా మెలగాలన్నారు.
అనుమానిత రవాణా పట్ల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రచార సామగ్రిపై ప్రచురణకర్త పేరు, వివరాలు లేకుంటే సీజ్ చేయాలన్నారు. సీజ్ చేసే సమయంలో అన్ని నియమ నిబంధనలను పాటించాలని వివరించారు. ఈ సందర్బంగా మాస్టర్ ట్రైనర్స్ వీరకాంతం, రాంరెడ్డి ఎన్నికల నిర్వహణపై శిక్షణనిచ్చారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్శర్మ, లింగ్యానాయక్, ఆర్డీవో వాసుచంద్ర, జడ్పీ సీఈవో సుధీర్, కార్మిక శాఖ అధికారి శ్రీనివాస్రావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచి గ్రామ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జరిగే పనులపై దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తక్కువ శాతం పనులు జరుగుతున్న గ్రామాల్లో లేబర్ సమావేశాలు నిర్వహించి, లేబర్ను సమీకరించి 100 శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, లేబర్ మొబిలైజేషన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలన్నారు.
జిల్లాలోని 565 గ్రామపంచాయతీల్లో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. ముండ్ల పొదలు క్లియర్ చేయడం, రోడ్లకు సంబంధించి భూమి చదును చేయడం, గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసి, పూర్తయిన వాటికి ఎఫ్టీవో జనరేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పరిధిలో పంచాయతీ సెక్రెటరీలను ఇన్వాల్వ్ చేయాలని కలెక్టర్ సూచించారు. టెలీ కాన్ఫరెన్స్లో డీఆర్డీఏ శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు వెలువడిన నేపథ్యంలో కలెక్టర్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), మీడియా సెంటర్ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారులు చెన్నమ్మ, ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూర్తి పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించాలన్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత హ్యాండోవర్ చేసే వరకు పరీక్ష సెంటర్ విడిచి వెళ్లకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు.
ఎస్హెచ్వో, సిట్టింగ్ స్కాడ్, డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. డ్యూటీలో ఉండే ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది మొబైల్ ఫోన్లు వాడరాదని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఉండే 80 సెంటర్లలో చెక్ చేయడం జరుగుతుందని, పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. పూర్తి ఎస్కార్ట్ తో పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాల తరలింపు జరుగుతుందని తెలిపారు. జూమ్ మీటింగ్లో జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.