వికారాబాద్, ఫిబ్రవరి 19 : వికారాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 21న కోస్గిలో నిర్వహించే సీఎం పర్యటనకు జిల్లా అధికారులందరూ అందుబాటులో ఉండాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 21న కోస్గి మండల కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, బహిరంగ సభ నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
రోడ్లు భవనాలు, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఎస్సీ, ఎస్టీ విభాగాల అధికారులతోపాటు సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులు స్పష్టమైన సమాచారాలతో ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధించిన శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, లింగ్యానాయక్ ప్రజల నుంచి 129 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో అధికంగా రెవెన్యూ సమస్యలపై అర్జీలు రాగా.. పెన్షన్లు, భూమి కొలతలు, వ్యవసాయ, పంచాయతీ సమస్యలపై వచ్చాయి. ప్రజావాణిలో వివిధ శాఖలకు జిల్లా అధికారులున్నారు.