ఆదిబట్ల, జూలై 30 : రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిగా సాధించడానికి అంకితభావంతో పనిచేయాలని, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకు నియంత్రణ అధికారులతో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకర్లు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి వంద శాతం లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.
ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యార్థులుకు అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాల గురించి వారికి అవగాహన కల్పించడం ద్వారా ఆసక్తి గల. అర్హత కలిగిన విద్యార్థులకు విద్యారుణాలు అందించడానికి చొరవ తీసుకోవాలన్నారు. వివిధ వర్గాల అభ్యున్నతి, ఆర్థిక పురోగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల కింద బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసి మద్దతు అందించాలని తెలిపారు. వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలు త్వరగా మంజూరు చేస్తే.. వారు వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి అవకాశముంటుందన్నారు.
ఇందిరా మహిళా శక్తి సంఘాలకు అవసరమైన రుణాలు అందించాలని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది దివ్యాంగులు ఉన్న గ్రూపులకు బ్యాంకు ఖాతాల తెరిచి రుణ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు వ్యవసాయశాఖ, ఇతర పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర శాఖల సమన్వయంతో స్వయం ఉపాధిలో సాయం చేయడానికి సకాలంలో రుణాలు అందించాలని కోరారు. రుణగ్రహీతలు యూనిట్లు స్థాపించారా లేదా, వారి అభివృద్ధిని నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను కోరారు.