వికారాబాద్, మార్చి 11 : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సమాజాన్ని ముందుకు నడిపించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘మహిళలు పెట్టుబడి పెట్టండి.. పురోగతిని వేగవంతం చేయండి’ అనే థీమ్ తో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. మహిళలు విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, లింగ వివక్షత పూర్తి స్థాయిలో రూపుమాపాలన్నారు.
ఈ సందర్భంగా లింగ వివక్షత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని సూచించారు. ఇంటి నుంచే మార్పు ప్రారంభం కావాలన్నారు. మగపిల్లలు, ఆడపిల్లలని వేర్వేరుగా చూడకుండా ఇద్దరినీ సమానంగా చూడాలన్నారు. ముఖ్యంగా పిల్లల్లో మార్పు తీసుకురావాలన్నారు. అప్పుడే నవ సమాజానికి నాంది అవుతుందన్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా అవలీలగా చేయగలరని మహిళలను అభినందించారు. సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు తమ నైపుణ్యాన్ని, పనితనాన్ని నిరూపించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు తల్లిదండ్రులను ఒప్పించి బాల్య వివాహాలు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తే వారికి పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. ఆడపిల్లల చదువుపట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఒక కుటుంబంలో మహిళ అక్షరాస్యురాలైతే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. మహిళా సాశొకారత కోసం కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అంగన్ంఇడీలు, ఆశ వర్కర్లు, ఇతర ఉద్యోగులు మహిళా నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ మాట్లాడుతూ.. లింగ వివక్షత లేకుండా ఇద్దరినీ సమానంగా చూడాలని, అవకాశాలు కల్పించాల్సిన అవశ్యతక ఉందన్నారు. మహిళలపై ఆరాచకాలు జరగకుండా ఎలా నిరోధించవచ్చు.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలు విద్య, వైద్యం, వ్యాపార ఇతర అన్ని రంగాల్లో అన్నింటా ముందుండి ఉన్నతంగా రాణించాలన్నారు. అమ్మాయిలు తాము ఎంచుకున్న రంగంలో రాణించేలా తల్లిదండ్రులు ప్రొత్సహించాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళా అధికారులు, సిబ్బందిని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు.
కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్మన్ వెంకటేశం, సభ్యులు ధనసిరి ప్రకాశ్, సంగమేశ్వర్, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సుధారాణి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లేశం, మెప్మా పీడీ రవికుమార్, గ్రౌండ్ వాటర్ అధికారిణి దీపారెడ్డి, సివిల్ సప్లై ఆఫీసర్ సుగుణ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉపేందర్, జిల్లా ఫారెస్ట్ అధికారి జ్ఞానేశ్వర్, డీపీఆర్వో చెన్నమ్మ, ఇరిగేషన్ అధికారిణి మాధవి, డీవైఎస్వో హనుమంతరావు, అగ్రికల్చర్ ఆఫీసర్ గోపాల్, ఎల్డీఎం రాంబాబు, సీడీపీవోలు ప్రియదర్శిని, వెంకటేశ్వరమ్మ, కాంతారావు, విజయలక్ష్మి, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.