వికారాబాద్ : అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వందేమాతరం గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో వచ్చిన మార్పులతో ప్రజలకు మేలు జరిగేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరేలా పని చేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పని చేస్తేనే సుపరిపాలన సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. శాఖల్లో స్పష్టమైన మార్పులతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకు రావడంతో పాలన ప్రజల చెంతకే వస్తుందన్నారు. పరిపాలన సంస్కరణలో ప్రక్షాళన చేస్తూ ప్రజలకు పాలన సౌలభ్యంగా ఉండేలా జిల్లాలను, మండలాలను, నూతనంగా ఏర్పాటు చేశారన్నారు. వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకొని రెండు రెవెన్యూ డివిజన్లు, రెండు మున్సిపాలిటీలు ఉన్న వాటిని నాలుగు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలో 17 మండలాలు నూతనంగా మూడు మండలాలను ఏర్పాటు చేసుకొని పరిపాలన సౌలభ్యాన్ని కల్పించినట్లు వివరించారు.
శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా మన రక్షణ కోసం పోలీస్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతనంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ల ఏర్పాటు, ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలకు పోలీస్ యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ధరణి వ్యవస్థలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ధరణి ద్వారా అతి తక్కువ సమయంలో భూ సమస్యల పరిష్కార దిశగా పని చేస్తున్నట్లు తెలిపారు. వేలి ముద్ర ద్వారా భూముల కేసులన్నీ పరిష్కార దిశగా ముందుకెళ్తున్నామన్నారు.
పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో కొత్తగా చట్టాలను తీసుకొచ్చి స్పష్టమైన విధి విధానాలతో పాలకవర్గం పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో హరితహారం నర్సరీల పెంపకం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిందన్నారు.
ఈ సందర్భంగా బీసీ కమిషన్ రాష్ట్ర సభ్యుడు శుభప్రద్పటేల్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రభు త్వం జవాబుదారీ తనంతో పని చేస్తున్నదన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్న క్రమంలో జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఇలాగే పనులు కొనసాగిస్తూ జిల్లాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్రంలో హరితహారం కారణంగా ఆరు శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు. ఇతర రాష్ర్టాలకు పర్యటనకు వెళ్లినప్పుడు తెలంగాణలో ఉన్న సంక్షేమం ఎక్కడా జరగడం లేదని, అధికారులు స్వయంగా చెబుతున్నారంటే, ఇది అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. దేశంలో అధిక విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. వికారాబాద్ జిల్లాలో అమరవీరులను స్మరించుకునేలా పెద్ద ఎత్తున స్తూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయ్కుమార్, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీఆర్వో అశోక్కుమార్, మిషన్ భగీరథ ఎస్ఈ ఆంజనేయులు, నీటి పారుదల శాఖ ఈఈ హెప్సీనాథ్, వ్యవసయ శాఖ అధికారి గోపాల్, పంచాయతీ శాఖ అధికారి తరుణ్కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఎస్ఐ జయరాజ్, పోలీస్ శాఖ అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్కుమార్గౌడ్, వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్లు మంజుల, స్వప్నతో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.