వికారాబాద్, జనవరి 31 : జిల్లాలో అన్ని ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించి పూర్తి లక్ష్యాన్ని సాధించాలని బ్యాంకర్లకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీసీ, డీఎల్ ఆర్సీ సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా డీఆర్డీఏ, మెప్మా తరఫున సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళా సంఘాల సభ్యులకు సూక్ష్మ ప్రణాళికలను సిద్ధం చేసి రూ. 100 కోట్ల విలువ గల చెక్కులను 4వ తేదీ వరకు సిద్ధం చేయాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున వచ్చే ఐదేండ్లలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు బ్యాంకర్లు అన్ని ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించాలన్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా రంగాల అభివృద్ధికి రుణాలు అందించేందుకు పరిశ్రమల శాఖ అధికారి, ఎల్డీఎంలు ఫిబ్రవరి మాసంలో లోన్ మేళాలు నిర్వహించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రుణాలను ఫిబ్రవరి మాసంతం వరకు అందజేయాలని, లేనిచో బ్యాంకులపై చర్యలు చేపట్టడం జరుగుతున్నదని హెచ్చరించారు.
వ్యవసాయ రంగానికి రూ. 3829.86 కోట్ల లక్ష్యం కాగా, రూ.2240.25 కోట్లు అందించి 58.49 శాతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 1200.55 కోట్లు లక్ష్యం కేటాయించగా, రూ.392.97 కోట్ల రుణాలు అందజేసి రూ.33.73 లక్ష్యం సాధించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు రూ. 6361.52 లక్ష్యం కాగా, రూ. 2663.56 కోట్లు అందజేసి 41.87 శాంతం లక్ష్యాన్ని, అలాగే ప్రాధాన్యత రంగాలకు రూ.1046.50 లక్ష్యం కేటాయించగా రూ.399.08 కోట్ల రుణాలను అందజేసి 38.13 లక్ష్యం సాధించడం జరిగిందన్నారు.
వానకాలం సీజన్ పంట రుణాలకు రూ. 1550.00 కోట్ల లక్ష్యం కాగా, రూ.1224.96 కోట్ల రుణాలు అందజేసి 79 శాంతం లక్ష్యం సాధించినట్లు బ్యాంకర్లు తెలిపారు. పంట రుణాలు 90 శాతానికి తగ్గకుండా లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 6736.82 కోట్లతో రూపొందించిన ప్రొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం రాంబాబు, ఆర్బీఐ/ ఎల్డీవోఎస్. గోమతి, నాబార్డ్/ డీడీఎం పీయూష్, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వినయ్ కుమార్, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.