వికారాబాద్, జనవరి 22 : ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పరిష్కరించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 45 ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎన్నెపల్లి చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని అధికారులకు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ప్రతిజ్ఞ, సమావేశం ఉంటుందని, ఐదుగురు వృద్ధులు, ఐదుగురు కొత్తగా ఓటర్ ఐడీ పొందిన యువకులను సన్మానించాలన్నారు.
గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఆకర్షణీయమైన శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అత్యుత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, జనవరి 22 : ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వచ్చిన ఆర్జ్జిలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి 40 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.