వికారాబాద్, జూలై 14 : ఎస్ఐఆర్ ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాలవారి కంటే మున్సిపల్ ప్రాంతాలవారే వెనుకంజలో ఉన్నారా అంటే.. ఉన్నారనే సమాధానం వినిపిస్తున్నది. మున్సిపల్ ప్రజలు ఎస్ఐఆర్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. బీఎల్వో, బీఎల్ఏలకు పూర్తి అవగాహన ఉన్నా కొంతమందికి మాత్రం అవగాహన కల్పించడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులున్నాయి. వాటిలో 61 మంది బీఎల్వోలు ఉన్నారు. అందులో మున్సిపల్ అధికారులు, సిబ్బందితోపాటు అంగన్వాడీ టీచర్లను సైతం నియమించారు. ఎన్యూమరేషన్ ఫారాలు 55,414 మందికి పంపిణీ చేయగా. ఇప్పటివరకు 22,134 ఫారాలు మాత్రమే వచ్చాయి. అందులో కూడా తప్పుల తడకగా కొన్ని రావడంతో మళ్లీ పూర్తిస్థాయిలో ఫారాలను నింపేందుకు తిరిగి పంపిస్తున్నారు. జూలై 24 చివరి తేదీ కాగా.. ఇప్పటివరకు 37 శాతం మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేశారు.

ఇందుకు ప్రధాన కారణం ఆయా వార్డుల్లో ఉన్న కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు అవగాహన కల్పించకపోవడమే. విద్యావంతులైన అంగన్వాడీ టీచర్లు లేకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవ్వడానికి ఒక కారణంగా మారింది. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో ప్రోత్సహించకపోవడంతో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్లక్ష్యంగా మారిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
బీఎల్ఓలు ప్రతి ఇంటికి తిరిగి ఇవ్వాల్సి ఉండగా.. కొంతమంది వార్డులోనే ఒక ప్రదేశంలో క్యాంపులా ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చినవారికి మాత్రమే ఫారాలు ఇస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకపోవడంతో ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన లేకుండాపోతున్నది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు వార్డుల్లో తిరిగి ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి ఫారాలను పూర్తి చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కాగా సర్ ప్రక్రియ సమయాన్ని పెంచే అవకాశాలున్నాయని సమాచారం.