ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 13: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున జిల్లాలోని ఆర్వోలు, ఈఆర్వోలు ఫామ్-7, 8 దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ భారతి హోలీకేరి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలు, ధరణి, జీవో 59 తదితర అంశాలపై బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ప్రాంతంలో ఓటింగ్ శాతం తగ్గినందున ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాబితాలో లోటుపాట్లు ఉంటే సవరించుకోవాలన్నారు. జాబితాలో పేర్లు తొలగించిన వాటి విషయంలో సమగ్రంగా ఇంటింటి సర్వే చేపట్టి పరిశీలించాలని, డ్యూప్లికేట్లు లేకుండా చూడాలన్నారు. ఫామ్-8 ద్వారా మార్పులు చేయాలని సూచించారు. 1450 పైచిలుకు ఓటర్లు కలిగిన చోట కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నదని తెలిపారు. ప్రజావాణిలో ధరణికి సంబంధించిన దరఖాస్తులు అధికంగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని, మరోసారి తప్పులు దొర్లకుండా చూసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో జీవో 59 కింద రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, తప్పుడు చేసినట్టు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.