షాబాద్, డిసెంబర్ 18: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం 8గంటల వరకు మం చు కమ్ముకుంటున్నది. చలి తీవ్రం కావడంతో పిల్లలు, వృ ద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు.
అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, గుండె సంబంధిత వ్యా ధులు కలిగిన వారు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణు లు సూచిస్తున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఉన్ని దుస్తులను వినియోగిస్తున్నారు. ఆయా ప్రాం తాల్లోని దుకాణాల వద్ద స్వెటర్లను కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో మంటలు ఏర్పాటు చేసుకుని కొద్దిసేపు మంటల వద్ద జనాలు కూర్చుని చలి నుండి రక్షణ పొందుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో తెల్లవారుజాము నుంచే మంచు గుప్పిట్లో గ్రామాలను కమ్ముకుంటున్నాయి. తెల్లారి ప్రజలు రోడ్డుపైకి రావాలంటే మంచు దుప్పటి కమ్ముకుంటుంది. వాహనాలపై వెళ్లే ప్రజలు చలి తీవ్రతకు తట్టుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే విధంగా రాత్రి సమయాల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది. సాయంత్రం 5గంటలు దాటితే చాలు జనాన్ని చలి వణికిస్తున్నది.
జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జోరుగా వీస్తున్న గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. దీనికి తోడుగా గాలిలో తేమశాతం పెరుగడంతో ఉదయం వేళల్లో చాలా గ్రామాల్లో పొగమంచు కమ్ముకుంటున్నది. తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8గంటల వరకు గ్రామాలతో పాటు రహదారులను మంచు తెరలు కమ్మేస్తున్నాయి. మంచు కమ్ముకోవడంతో ఉదయం పూట వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. చలి గాలుల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.