షాద్నగర్, సెప్టెంబర్16 : నాడు కరువుతో తల్లడిల్లిన పాలమూరు రైతుల గోస తీరే సమయం వచ్చిందని, కరువు నేలను కృష్ణమ్మ తడిపే శుభ గడియలు సమీపించాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కొల్లాపూర్ లో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు షాద్నగర్ నుంచి వెళ్లిన ఆయన ఉద్దండపూర్ , కర్వేన రిజర్వాయర్ను పరిశీలించి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాకరమైందన్నారు. ఊహించని రీతిలో కృష్ణ జలాలను పాతాలం నుంచి పాలమూరు బీడు భూములకు మళ్లిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు.
నాడు వలసలతో వలవల ఏడ్చిన రైతులు, నేడు సంతోషంగా ఎవుసం చేసుకునే సమయం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే అన్ని రిజర్వాయర్లకు సాగు నీళ్లు రావడంతో పాటు కాలువల నిర్మాణ పనులను పూర్తిచేసి పంట పొలాలకు నీళ్లను అందిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ సభ ఓ పండుగ వాతావరణాన్ని తలపించిందని, అన్ని వర్గాల ప్రజలు పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, సీనియర్ నాయకుడు వంకాయల నారాయణరెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.