రంగారెడ్డి, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) ; స్వరాష్ర్టాన్ని సాధించి.. తెలంగాణ గతిని మార్చిన ఘనుడు.. అలుపెరుగని వీరుడు.. అభివృద్ధి ప్రదాత.. జన హృదయ నేత సీఎం కేసీఆర్ పుట్టిన రోజును శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రైతుబంధు, దళితబంధు తదితర పథకాలు అందుకున్న ఎందరో లబ్ధిదారులు కేక్ కట్ చేసి సీఎం సార్ సల్లంగా ఉండాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, సీఎం కేసీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టి.. జననేతకు పుట్టిన రోజు కానుక అందించారు. జనహితమే తన అభిమతంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో పూజలు, హోమాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కేసీఆర్ చిత్ర పటాలు చేతబూని భారీ ర్యాలీలు నిర్వహించడంతో పల్లెలు, పట్టణాలు గులాబీమయంగా మారాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు కేక్లు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, నోటుబుక్లు, దవాఖానలు, అనాథ ఆశ్రమాల్లో రోగులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. పటాకుల మోత, ఆటల పోటీలతో ఊరూరా పండుగ వాతావరణం కనిపించింది. మంత్రి సబితారెడ్డితోపాటు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జన హృదయ నేత సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఊరూరా పండుగ వాతావరణం నెలకొనడంతో పాటు గులాబీ తోరణాలతో కళకళలాడాయి. పల్లెలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పార్టీ శ్రేణుల సందడి నెలకొన్నది. సీఎం కేసీఆర్ చిత్ర పటాలతో బైకు, వాహనాల ర్యాలీలు తీశారు. అభిమానులు, కార్యకర్తలు కేకులు కట్ చేసి పంచిపెట్టారు. దవాఖానలు, వృద్ధ, అనాథ ఆశ్రమాల్లో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. పాఠశాలలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ‘దేశ్ కీ నేత.. కేసీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేతలు, అభిమానులు, కార్యకర్తలు పలు చోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహించారు. పలు చోట్ల కబడ్డీ, క్రికెట్ వంటి ఆటల పోటీలు నిర్వహించారు. పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు వర్ధిల్లాలని వేడుకున్నారు. పలు చర్చీలు, దర్గాల్లో సైతం అభిమానులు ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాల్లో కేకులను కట్ చేసి బాణసంచా కాల్చి, మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న జనం.. సీఎం కేసీఆర్ను కుటుంబ సభ్యుడిగా భావించి పలుచోట్ల కేక్లు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
వికారాబాద్ జిల్లాలో…
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ ర్యాలీలు తీసి కేకు కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ ప్రజా ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆలంపల్లి అనంతపద్మనాభస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సుఃఖసంతోషాలతో పరిపాలన అందించాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కొడంగల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.
పరిగిలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే మొక్క నాటి నీరు పోశారు. పరిగిలోని సర్కారు దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సూచనల మేరకు పట్టణ శాఖ అధ్యక్షుడు నయీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపనర్సింలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాలో..
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తన క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. మహేశ్వరం మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖానలో రోగులకు, గర్భిణులకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా హరినాథ్రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. షాద్నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ భారీ కేకును కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఎఫ్సీఎన్ వృద్ధాశ్రమాల్లో అన్నదానం, పట్టణాల్లో మొక్కలు నాటారు. కేశంపేట, కొత్తూరు, నందిగామ, కొందుర్గులలో పటాకులు కాల్చారు. కొత్తూరు సర్కారు దవాఖానలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు.
చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య కేక్ కట్ చేసి స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. మొయినాబాద్లో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ను కట్చేసి సంబురాలు నిర్వహించారు. శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో రోగులకు స్థానిక బీఆర్ఎస్ నేతలు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. షాబాద్లో జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కాగా, ఎంపీ రంజిత్ రెడ్డి రక్త దానం చేశారు.