భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘హరిత’యజ్ఞానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో భాగంగా ‘కోటి వృక్షార్చన’ చేపట్టనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి జిల్లా వేదిక కానున్నది. జిల్లాలోని చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో శనివారం సీఎం కేసీఆర్ మొక్కలు నాటి కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాకుండా 360 ఎకరాల్లో సకల సదుపాయాలతో నిర్మించిన ఈ పార్క్ను ముందుగా ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు ‘కోటి వృక్షార్చన’కు రంగారెడ్డి సిద్ధమైంది. అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో జిల్లావ్యాప్తంగా ఒకేరోజు 5.40లక్షల మొక్కలను నాటేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఒక్కో గ్రామ పంచాయతీలో 750 మొక్కలకు తగ్గకుండా మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించారు. కాగా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత జూన్ 19న తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో సీఎం కేసీఆర్ మొక్కను నాటి హరితోత్సవాన్ని ప్రారంభించారు. అదే రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల భాగస్వామ్యంతో 25వేల మొక్కలు నాటారు.
-రంగారెడ్డి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో సీఎం కేసీఆర్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరోపక్క రంగారెడ్డి జిల్లా సైతం ‘కోటి వృక్షార్చన’కు సిద్ధమైంది. అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో జిల్లావ్యాప్తంగా ఒకేరోజు 5.40 లక్షల మొక్కలను నాటేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులతో పాటు, సామాన్య ప్రజానీకం, విద్యార్థిలోకం ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటేందుకు సిద్దమవుతున్నారు. హరితస్ఫూర్తిని చాటే ఈ వినూత్న కార్యక్రమం యావత్ జిల్లా అంతటా కనువిందు చేయబోతున్నది.
‘కోటి వృక్షార్చన’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శనివారం రంగారెడ్డి జిల్లా మంచిరేవుల నుంచి శ్రీకారం చుడుతున్నారు. చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని 360 ఎకరాల్లో సకల సదుపాయాలతో నిర్మించిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ను ప్రారంభించిన అనంతరం అక్కడే మొక్కలు నాటనున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగానూ ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోనూ పండుగ వాతావరణంలో నిర్వహించేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని శాఖల అధికారులు ముందుగానే కార్యాచరణను సిద్దం చేసుకున్నాయి. ప్రతి పంచాయతీని యూనిట్గా తీసుకుని సర్పంచుల నేతృత్వంలో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటనున్నారు. గ్రామీణాభివృద్ది శాఖ, అటవీ శాఖలు సమన్వయం చేసుకుని అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచి, ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సమకూర్చారు. జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపడుతుండగా.. ప్రతీ పంచాయతీలోనూ 750 మొక్కలను నాటేలా ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీల్లోనూ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలలో ఖాళీ ప్రదేశాల్లో, రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటనున్నారు. మొత్తంగా..జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజులో 5.40 లక్షల మొక్కలను నాటేందుకు రంగం సిద్ధం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులతోపాటు జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. మహిళా సంఘాలు, విద్యార్థులతో పాటు సామాన్య ప్రజానీకం సైతం ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుంటున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ గత జూన్ 19న తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో మొక్కను నాటి హరితోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల భాగస్వామ్యంతో 25వేల మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలోనే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమానికి సైతం రంగారెడ్డి జిల్లానే వేదికగా నిలుస్తున్నది.
ప్రతియేటా నిర్దేశించుకున్న హరితహారం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 2015-16 సంవత్సరం నుంచి హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ యజ్ఞంలా చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా రంగారెడ్డి జిల్లాలో 2015లో 73.78లక్షల మొక్కలను, 2016లో 1.39కోట్ల మొక్కలను, 2017లో 71.04లక్షల మొక్కలను, 2018లో 86.12లక్షల మొక్కలను, 2019లో 1.05కోట్ల మొక్కలను, 2020లో 1.02కోట్ల మొక్కలను, 2021లో 89.24లక్షల మొక్కలను, 2022లో 81.48లక్షల మొక్కలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటారు. 2023-24 సంవత్సరానికి 78.66లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 55.39 లక్షల మొక్కలను నాటారు. మొత్తంగా ఇన్నేండ్లలో రంగారెడ్డి జిల్లాలో 8 కోట్లకు పైగానే మొక్కలను హరితహారం కార్యక్రమంలో నాటారు.
కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు మంచిరేవులకు వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు, విద్యా సంస్థలు, యువత భాగస్వామ్యులై కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ హరీశ్, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింఘ్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్రం జయవంత్ తదితరులు ఉన్నారు.