నేటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభ పండుగకు ఉమ్మడి జిల్లా జనం భారీగా తరలివెళ్లనున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలను తరలించే అపూర్వ ఘట్టానికి సీఎంకేసీఆర్ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. మోటర్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేయనున్నారు. ఈ దృశ్యాన్ని కండ్లారా చూసి తరించేందుకు ప్రజానీకం ఉవ్విళ్లూరుతున్నది. మంత్రి సబితారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 15
రంగారెడ్డి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్వప్నం సాకారమవుతోంది. నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలను తరలించే అపూర్వ ఘట్టం శనివారం ఆవిష్కృతమవుబోతున్నది. సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగు నీరందించడంతోపాటు తాగునీటి తిప్పలు తీర్చే ఎత్తిపోతల ప్రారంభోత్సవ దృశ్యాన్ని కండ్లారా చూసి తరించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజానీకం ఉవ్విళ్లూరుతున్నది. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 266 బస్సులను సమకూర్చుతున్నది. ప్రారంభోత్సవం తర్వాత కృష్ణా జలాలను తెచ్చి గ్రామాల్లోని దేవుండ్లకు అభిషేకం చేయడంతోపాటు భారీగా సంబురాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ 2015 జూన్ 11న శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతలను అడ్డుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేశారు. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో ఇటీవలనే ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. కొద్దిరోజుల క్రితమే నీటిపారుదల శాఖ అధికారులు నిర్వహించిన డ్రై రన్ సక్సెస్ అయ్యింది. దీంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి శనివారం ముహూర్తం ఖరారు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను 2 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ ద్వారా తొలుత హెడ్ రెగ్యులేటర్కు అక్కడి నుంచి 3 సొరంగాల ద్వారా నార్లాపూర్ సర్జ్ఫూల్కు తరలిస్తారు. అటునుంచి అంజనగిరి రిజర్వాయర్లోకి, వీరాంజనేయ రిజర్వాయర్లోకి ఆ తర్వాత వెంకటాద్రి, కురుమూర్తి, ఉదండాపూర్ రిజర్వాయర్లకు దశల వారీగా తరలిస్తారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉదండాపూర్ రిజర్వాయర్ కీలకం కాగా..ఈ రిజర్వాయర్ కిందనే అత్యధికంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగు నీరందనుంది. ఉమ్మడి జిల్లాలోనే 1,100 చెరువులను ఈ ఎత్తిపోతల నీటితో నింపనున్నారు. ఇప్పటికే కెనాల్స్ నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్లను సైతం పిలిచింది. అన్ని అనుకూలిస్తే ఉదండాపూర్ రిజర్వాయర్కు ఈ ఏడాది నవంబర్ నాటికే నీరు అందించే అవకాశం ఉంది. రైతాంగం ఈ ప్రాజెక్టు కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నది. దశాబ్దాల నాటి కలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్కు మనస్ఫూర్తిగా జిల్లా ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతున్నది.
ఎత్తిపోతలను శనివారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలివెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బస్సుల్లో బయల్దేరే ముందే ఆయా గ్రామాల్లో అధికారులు బ్రేక్ ఫాస్ట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి ప్రాంతాల నుంచి బస్సుల్లో వెళ్లేవారికి ఆమనగల్లులోని ఫంక్షన్హాల్స్ వద్ద మధ్యాహ్నం, రాత్రి భోజన వసతులను ఏర్పాటు చేస్తున్నారు. షాద్ నగర్, చేవెళ్ల నుంచి వెళ్లేవారికి షాద్ నగర్ వద్ద ఫంక్షన్హాల్స్లో ఏర్పాట్లు చేస్తున్నారు. వెజ్ బిర్యానీ ప్యాకెట్లు, నీటి బాటిళ్లను అందించనున్నారు. ఆమనగల్లు పాయింట్ వద్ద ఏర్పాట్ల బాధ్యతను డీఆర్డీవో ప్రభాకర్కు, చేవెళ్ల వద్ద ఏర్పాట్లను పశు సంవర్ధక శాఖ జేడీ అంజలప్పలకు అప్పగించారు. పర్యవేక్షణ కోసం ఎంపీడీవోలను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ప్రతి బస్సుకు పంచాయతీ సెక్రటరీలను ఇన్చార్జీలుగా నియమించారు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 15 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సాగునీటి సమస్య శాశ్వతంగా తీరనుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నార్లాపూర్ వద్ద సీఎం కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి బస్సుల్లో నార్లాపూర్కు చేరుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు సమస్య తీరనున్న తరుణంలో నియోజకవర్గ ప్రజలంతా ముఖ్యమంత్రికి అండగా నిలువాల్సిన అవసరం ఉందని అయన పిలుపునిచ్చారు.
పాలమూరు ప్రజల కల సాకారం అవుతున్న వేళ ఇక్కడి రైతులు చాలా సంతోష పడుతున్నరు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా నీళ్లు ఇక్కడి బీడు భూములకు పారే సమయం వచ్చింది. రైతులకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదటి పంప్ హౌస్ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. అనంతరం కొల్లాపూర్ పట్టణ సమీపంలోని సింగోటం చౌరస్తాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు మా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పల్లెలు, తండాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారు. నియోజకవర్గం నుంచి వెళ్లే వాహనాలు మొదటగా ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి కర్వేన రిజర్వాయర్ మీదుగా సీఎం సభా స్థలానికి చేరుకుంటాయి.
– వై. అంజయ్యయాదవ్, షాద్నగర్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో నదుల దిశ, ఎవుసం దశ మారబోతున్నది. కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి వ్యవసాయం సస్యశామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టడం గొప్ప పరిణామం. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందనుంది. రైతుబిడ్డగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా అనేక ప్రాజెక్టులు నిర్మించి, వ్యవసాయానికి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి, గిట్టుబాటు ధర అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రాజెక్టుతో నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
వికారాబాద్, సెప్టెంబర్ 15, (నమస్తే తెలంగాణ): దశాబ్దాల కల నేటితో సాకారం కానున్నది. జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోనున్నది. ప్రాణహితతో జిల్లాకు సాగునీరు తీసుకురావడం సాధ్యంకాదని గుర్తించి సీఎం కేసీఆర్ స్వయంగా తానే డిజైన్ చేసి చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ లిఫ్ట్-1 వద్ద వెట్న్న్రు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించనున్నారు. అయితే ఉద్దండపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగు, సాగు నీరందించనున్నారు. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలోని సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది, అదేవిధంగా జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లోని 910 హబిటేషన్లకు తాగునీరందించనున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఉద్దండడాపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగు, సాగునీటి కాలువల నిర్మాణానికి రూ.5180 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు తాగునీటిని అందించేందుకుగాను 100 కిలోమీటర్ల మేర కాలువలను నిర్మించనున్నారు. సాగునీరొస్తే వ్యవసాయ రంగంతోపాటు పారిశ్రామిక తదితర అనుబంధ రంగాలన్నీ బలోపేతం కానున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి 135 బస్సుల్లో రైతులు భారీగా తరలివెళ్లనున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి 100 బస్సులు, వికారాబాద్ నియోజకవర్గం నుంచి 15 బస్సులు, పరిగి, తాండూరు నియోజకవర్గాల నుంచి 10 చొప్పున ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
ఆమనగలు/కడ్తాల్, సెప్టెంబర్ 15 ః పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి జిల్లాలకు వరప్రదాయని అనిఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం సా యంత్రం ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో బీడు భూములన్నీ సస్యశామలమవుతాయన్నారు. ప్రాజెక్టు వల్ల కల్వకుర్తి నియోజకవర్గంలో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అదే విధంగా కల్వకుర్తికి కేఎల్ఐ ద్వారా లక్ష ఎకరాలు, డీఎల్ఐ ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నదని తెలిపారు. శనివారం నార్లాపూర్ రిజర్వాయర్ ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రిజర్వాయర్ ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. సమావేశంలో వెల్డండ జడ్పీటీసీ విజితారెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు పత్యానాయక్, మండల అధ్యక్షుడు అర్జున్రావు, నాయకులు ఖలీల్, శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు.