వికారాబాద్, నవంబర్ 22 : సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ విజయానికి కృషి చేయనున్నారు. ఈ సభకు వికారాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. సుమారు 50 వేల మందికి సరిపోయే టెంట్లు, కుర్చీలు, తాగునీటి సదుపాయాలు ఏర్పాట్లు చేశారు.
వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా వికారాబాద్లోని మిషన్ గ్రౌండ్లో దిగుతారు. అక్కడి నుంచి కారులో బ్లాక్ గ్రౌండ్లో నిర్వహించే సభకు హాజరవుతారు. స్టేజిపై దాదాపు 100 మందికిపైగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు.ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం వికారాబాద్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో ఆశీర్వాద సభ నిర్వహించి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రజా ఆశీర్వాద సభ ఉంటుందని తెలిపారు.
సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు గయాజ్, కౌన్సిలర్ అనంత్రెడ్డి, నాయకులు లక్ష్మీకాంత్రెడ్డి, టైగర్ కృష్ణయ్య, దేవదాసు, అశోక్, రమేశ్ పాల్గొన్నారు.