రంగారెడ్డి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ, భూ సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాలోని ప్రతి భూమి, రైతు వివరాలను ‘ధరణి’లో నిక్షిప్తం చేశారు. ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు వేశారనే అంశాల ప్రకారంగా వ్యవసాయ శాఖ సర్వే చేసి ఆ వివరాలను ‘ధరణి’తో లింకు చేసింది. రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలనూ అనుసంధానం చేసి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నది.
రైతులకు ఎంత మొత్తంలో ఎరువులు కావాలో ప్రభుత్వం అంచనా వేసి కొరత లేకుండా చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లు ‘ధరణి’ని తీసేస్తే.. భూములు, రైతుల వివరాలు ఉండవు. ఈ వివరాలే లేనప్పుడు ఎన్ని ఎరువులు కావాలో తెలియక ఎరువుల కొరత వస్తుంది. విత్తనాల కొరత కూడా వస్తుంది. రైతు బంధు బంద్ అవుతుంది. రైతు బీమా అమలు కూడా సాధ్యపడదు. భూములకు లెక్క పత్రం ఉండక ఎవరి భూమి ఎవరి పేరుపై ఉన్నదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామాల్లో రైతుల మధ్య భూ తగాదాలు, గెట్ల పంచాయితీలు పెరిగిపోతాయి.
ఈ పంచాయతీలతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. ఈ గొడవలతో రైతులు పొలాలను వదిలేసి, ఎవుసాన్ని పడావుగా పెట్టేసి మళ్లీ వలసలు వెళ్లే దుస్థితి వస్తుంది. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అధికారంలోకి వస్తే రైతులు బాగుండేలా నిర్ణయాలను ప్రకటిస్తుంది. కానీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందుకు విరుద్దమైన ప్రకటనలు చేసి వ్యవసాయ రంగాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నది. రైతుల బతుకులను ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్నది. ధరణిని తీసేస్తే గోస పడక తప్పదని జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. భూములకు రక్షణ కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన కేసీఆర్ను గెలిపించుకోవాలని రైతాంగం పిలుపునిస్తున్నది.
‘ధరణి’ని రద్దు చేస్తే దళారులు రాజ్యమేలుతరు. అన్నదాతల శ్రేయస్సుకు ధరణే ముద్దు.. ఈ కాంగ్రెస్ మాకొద్దు. కాంగ్రెస్ హయాంలో రైతులు గొసపడ్డరు. భూ రిజిస్ట్రేషన్ కావాలంటే తహసీల్దార్, వీఆర్వోలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తది. పాత పద్ధతి వస్తే మనకు తేలియకుండానే వేరే వారి పేరుపై భూమిని మార్చుకుంటరు. ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం రాక్షసుల పాలు కావొద్దు. కౌలుదారు చట్టంతో రైతులకు కిరికిరిలొస్తయ్. ‘ధరణిలో భూమి వివరాల ఎక్కిన తర్వాత మన వేలి ముద్ర పెడితేనే వేరే వారికి రిజిస్ట్రేషన్ అవుతుంది. కాంగ్రెస్ ఓడిపోవాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ గెలువాల్సిందే. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం.. కారుగుర్తుకే ఓటు వేస్తం.
– మాణయ్య ,అంతప్పగూడ (శంకర్పల్లి)
‘ధరణి’ భూ రిజిస్ట్రేషన్ల తిప్పలు తప్పినయ్. కాంగ్రెస్ హయాంలో ఆఫీస్ చుట్టూ తిరిగేటోళ్లం. పట్వారీలకు పైసలియ్యకపోతే పని కాకపోయేది. సాక్షులను తీసుకుని ఆర్డీవో ఆఫీసుకు వెళ్లాలంటే డబ్బులు ఖర్చయ్యేవి. ‘ధరణి’ వచ్చాకే ఆ బాధలు తీరినయ్. స్లాట్ బుక్ చేసుకుని ఇచ్చిన టైంకు వెళితే పైసా ఖర్చు లేదు. అటువంటి ‘ధరణి’ని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతం. కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటం. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతున్నది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ను నమ్మము. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం.
– ఎల్మినేటి శ్రీనివాస్రెడ్డి, బ్రహ్మణపల్లి (తుర్కయాంజాల్ మున్సిపాలిటీ)
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూ రిజిస్ట్రేషన్లు, సవరణలు ఉంటే పడరాని పాట్లు పడ్డం. భూములు అమ్ముకున్నా, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు తిరిగి తిరిగి అవస్థ తీసేది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ‘ధరణి’ అమలు కావడంతో దళారుల దరిద్రం పోయింది. గంటలోపే రిజిస్ట్రేషన్ అవుతున్నది. వెంటనే మ్యుటేషన్ అవుతున్నది. ఇదివరకు పేరేమన్నా మారిందేమొనని టెన్షన్గా ఉండేది. ఇప్పుడు పట్టాదారు వేలిముద్ర వేస్తేనే పేరు మారుతది. ఓడిపోయే కాంగ్రెస్ నాయకుల మాటలు ఎవ్వరూ వినరు. ఓట్లప్పుడే కాంగ్రెసోళ్లకు రైతులు గుర్తుకొస్తరా..? అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ఆగమైనము కదా.. ధరణిని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. కారుగుర్తుకే ఓటు వేస్తం.
కాంగ్రెస్ హయాంలో భూముల వివరాలు తెలుసుకోవాలన్నా రోజుల కొద్దీ తిరుగాల్సి వచ్చేది. పట్వారీలు నిద్రమత్తులో ఎవరి సర్వే నంబర్ మీద ఎవరి పేరు రాస్తారో తెలువని పరిస్థితి. ఇప్పుడు ఫోన్లోని యాప్ ఓపెన్ చేసి భూమికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ను ఓడిస్తం. బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు. కారుగురుకే ఓటు వేస్తం.
– చేగూరి మహేశ్ (కడ్తాల్)
కాంగ్రెస్ హయాంలో కౌలుదారు చట్టంతో రైతులు కష్టాలు పడ్డరు. మళ్లీ కాంగ్రెస్కు అధికారమిస్తే రైతులకు కిరికిరిలు తప్పవు. కౌలుదారు చట్టం తీసుకొస్తే పట్టా ఉన్న రైతుతో పాటు కౌలు రైతు పేరునూ రికార్డుల్లోకి ఎక్కిస్తరు. దీంతో ఇద్దరి మధ్య గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టాదారులెవరూ కౌలుకు ఇవ్వడానికి ముందుకు రారు. వాళ్ల పొట్టకొట్టేలా కాంగ్రెస్ తీరు ఉన్నది. ఇటువంటి చెత్త చట్టం తీసుకురావాలనుకుంటున్న అధికారంలోకి రానియ్యకుండా రైతులందరూ కలిసి కట్టుగా ఉండి ఓడిస్తం. ‘ధరణి’తో భూమిపై సర్వ హక్కులు కల్పించిన బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తం.
– నత్తి కృష్ణారెడ్డి (చేవెళ్లటౌన్)
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. భూ రికార్డుల్లో భూములు ఉండకపోయేది. ఎన్నో భూములు కబ్జాకు గురయ్యేది. పట్టాదారు కాలంలో పేరు మారి ఇబ్బందులు పడేవారు. రైతులు అయోమయానికి గురై ఆఫీసర్ల చుట్టూ తిరిగేటోళ్లు. పైసల ఖర్చుతో పాటు సమయం వృథా అయ్యేది. ‘ధరణి’ వచ్చాకే సమస్యలు లేకుండా పోయాయి. రైతుల సంక్షేమం కోసం ఆలోచించే బీఆర్ఎస్ పార్టే మళ్లీ గెలువాలి. కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో బొందపెడుతం.
– శ్రీరంగాపురం కుమార్, లక్ష్మారావుగూడ (షాబాద్)
కౌలుదారు చట్టం తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయం. ‘ధరణి’తో రైతుల భూ సమస్యలు తీరినయ్. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సులువుగా అవుతున్నాయి. ఏడాదికి రెండుసార్లు పెట్టుబడి సాయం అందుతున్నది. ‘ధరణి’ని తీసేసి అనుభవదారు కాలం, కాస్తుకాలం అంటూ మళ్లీ సమస్యలు మొదటికొస్తాయి. రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై ఎరువులు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి గెలిపించుకుంటం. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమే. కాంగ్రెసోళ్ల బట్టేబాజి మాటలు మేము నమ్మం. రైతుల క్షేమం కోరే బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు కావాలి.
– శ్రీనివాస్, తంగడిపల్లి గ్రామం (చేవెళ్ల రూరల్)
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతులకు భరోసా ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్నట్లుగా భూముల పరిస్థితి ఉండేది. వ పట్వారీ వ్యవస్థ మళ్లీ వస్తే రైతులకు గోస తప్పదు. భూ సమస్యల కథ మొదటికొస్తది. వీఆర్వోలు, ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాక గోస పడాల్సి వస్తది. గతంలో ఉన్నట్లు లొల్లులు, పంచాయితీలు వస్తయ్. రైతులు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలి. రైతుల బాగు కోరే సీఎం కేసీఆర్ వెంటే ఉంటం.
– జోగిరెడ్డి, నందివనపర్తి (యాచారం)
ధరణి పోర్టల్తో భూములు భద్రంగా ఉన్నాయి. భూములను అమ్మడం, కొనడం క్షణాల్లో జరుగుతుంది. ‘ధరణి ’రని తీసేస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మాకు అసలే వద్దు.. పాత పద్ధతి లాగా పట్వారీ వ్యవస్థ వద్దేవద్దు. గతంలో పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు డబ్బులు ఉన్నోడిదే రాజ్యం అన్నట్లుగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకే రైతులమంతా మద్దతు తెలుపుతం. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. కారుగుర్తు ఓటు వేసి కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతం. ‘ధరణి’ పోర్టల్ను యథావిధిగా కొనసాగించాలి.
– సురమల్ల సుభాష్, నాగిళ్ల గ్రామం, మాడుగుల మండలం (ఆమనగల్లు)
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలుదారు చట్టంతో రైతుల మధ్య గొడువలు తప్పవు. ‘పాత కుండల కొత్త చింతకాయ పచ్చడి’ మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతం. భూములకు భద్రత కల్పించి బీఆర్ఎస్ను గెలిపించుకుంటం. ధరణి ఫోర్టల్ను ఎత్తేసే కాంగ్రెసోళ్లు మాకొద్దు. గతంలో కాంగ్రెస్ పాలనలో భూములకు రక్షణ ఉండేది కాదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు రికార్డుల్లో పేర్లు రాసేటోళ్లు. ‘ధరణి’ని తీసుకొచ్చిన కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నం.