రంగారెడ్డి, జనవరి 5(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నది. ఆయా వృత్తుల వారిని సంఘటితం చేస్తూ బలోపేతం చేసేందుకు అహర్శిశలు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే మత్స్యకారుల సంఘాల కు గుర్తింపును ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. మత్స్యకారుల సొసైటీ లు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఇప్పటికే రికార్డు సృష్టించింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 110సొసైటీలుండగా అందులో 5,7 00 మంది సభ్యులున్నారు. ఈ మేరకు జిల్లాలో ఉన్న మత్స్యకార సొసైటీలను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లాలోని అధికారులు మొదటి విడుతలో భాగంగా ‘బెస్తవారు, ముదిరాజు’లను మత్స్యకార సొసైటీల ఏర్పాటుకు ప్రామాణికంగా తీసుకున్నారు. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీ లు, చెరువుల విస్తీర్ణాన్ని బట్టి అధికారులు సొసైటీలను ఏర్పాటు చేశారు. గతంలో 110 సొసైటీలుండగా.. ఇటీవల పూర్తైన మొదటి విడుతలో మరో 48 సొసైటీలు కొత్తగా ఏర్పడ్డాయి. వాటి తో కలిపి జిల్లాలో 158 మత్స్యకార సొసైటీలుం డగా సభ్యుల సంఖ్య 6400 మంది ఉన్నారు. ఒక్కో సొసైటీలో 11మంది సభ్యులుండగా.. అధికంగా చెరువుల విస్తీర్ణాన్ని బట్టి సభ్యుల సంఖ్యను నిర్ధారిస్తున్నారు. అయితే ఈ 48 సొసైటీల్లో దాదాపుగా 700 మంది సభ్యులుగా ఉన్నారు. సొసైటీల్లో సభ్యులుగా ఉన్న కుటుంబాలకు అనుకోకుండా ఏమైనా జరిగితే రూ. 5లక్షల జీవిత బీమాను ప్రభుత్వం కల్పించనున్నది.
ఈ నెల 6వ తేదీ నుంచి మత్స్యకార సొసైటీల ఏర్పాటుకు జిల్లా అధికారులు రెండో విడుతను నిర్వహించనున్నారు. ఇందులో ముదిరాజ్లు, ముత్రాస, బెస్త, తెనుగు వంటి జాతుల వారికి చోటు కల్పించనున్నట్లు సమాచారం. మత్స్యకార సొసైటీల్లో ఇప్పటివరకు 33 జాతుల వారు ఉన్నట్లు సమాచారం. రెండో విడుతను ఇటీవలె మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించగా.. ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగనున్నది. కొత్తగా ఏర్పడే సొసైటీలు, సభ్యులకు జిల్లా అధికారులు త్రిసభ్య కమిటీగా ఏర్పడి వృ త్తి పరమైన పరీక్షలను మార్చి నెలాఖరు వరకు నిర్వహించనున్నారు. ఆయా పరీక్షల్లో నెగ్గిన వారికే సొసైటీల్లో చోటు కల్పించనున్నట్లు తెలిసింది.
జిల్లాలో సొసైటీల ఏర్పాటుతో వ్యక్తులకు సభ్యత్వంతోపాటు అనేక హక్కులు సంక్రమించనున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు చెరువులపై ఆ యా సొసైటీల సభ్యులకు అధికారం లభించను న్నది. చేపలను పెంచడం, వాటిని పట్టి, విక్రయించడం అంతా సొసైటీ సభ్యుల చేతుల్లోనే ఉంటుంది. తద్వారా వారికి ఉపాధి లభిస్తుంది. గతంలో చెరువులపై అధికారం గ్రామ సర్పంచ్కే ఉండేది. ప్రభు త్వం దీనిని మత్స్యశాఖకు బదిలీ చేసింది. దీంతో మత్స్యకారులకు ఆర్థికంగా మరింత ప్రయోజనం చేకూరనున్నది.
జిల్లాలోని మత్స్యకారులకు గుర్తింపుతోపాటు జీవితబీమాను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల శ్రేయస్సుకు పాటుపడుతున్నది. అందులో భాగంగానే రెండో విడుతను ఈ నెల 6వ తేదీ నుంచి చేపడుతున్నాం. ఆయా సొసైటీల్లోని సభ్యులకు వృ త్తిపరమైన పరీక్షలు నిర్వహించి తగిన గుర్తింపు ఇవ్వనున్నాం. ఈ నెల నుంచి మార్చి, ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ రెండో విడుత కొనసాగనున్నది. మత్స్యకారులు ముందుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– సుకీర్తి, మత్స్యశాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా
మత్స్యకారుల(మత్స్యకారులు, మహిళా మత్స్యకారులు, మత్స్య కార్మికులు, చేపల పెంపకందారులు, మత్స్య సంబంధిత పనుల్లో పాల్గొనే వ్యక్తులు) కో సం ప్రభుత్వం గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీ మ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 18 నుంచి 70 ఏండ్ల వరకు ఈ స్కీం వర్తించనున్నది.