సకలజనుల సంక్షేమం.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపకల్పన చేసింది. ఆదివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఉమ్మడి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీపడకుండా పాత పథకాలకు సంబంధించిన సాయాన్ని పెంచుతూనే.. మరిన్ని కొత్త పథకాలను ప్రకటించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి అధికారంలోకి రాగానే అన్నపూర్ణ పథకం కింద రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పుడిస్తున్న ఆసరా పింఛన్లను 5వేల వరకు, రైతుబంధు సాయాన్ని రూ.16వేల వరకు దశలవారీగా పెంచనున్నట్లు పేర్కొన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3వేల భృతి ఇస్తామన్నారు. కేసీఆర్ బీమా పేరిట ప్రతి ఇంటికీ ఆర్థిక ధీమా కల్పిస్తామని, అందుకోసం ప్రతి ఏడాది ఎల్ఐసీ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలతోపాటు, అందులోలేని అనేక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మ్యానిఫెస్టోను సైతం కచ్చితంగా అమలు చేసి తీరుతారన్న నమ్మకాన్ని ప్రజానీకం వ్యక్తం చేస్తున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పుట్టిస్తుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
పరిగి, అక్టోబర్ 15 : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, పార్టీ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి అన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ఆదివారం పరిగిలో బీఆర్ఎస్ నేతలు పటాకులు కాల్చి సంబురాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్ల రేషన్కార్డులు ఉన్న వారందరికీ బీమా సదుపాయం కల్పించడం, ఆసరా పింఛన్లు, రైతుబంధు పెంపు, రూ.400కే వంటగ్యాస్ సిలిండర్ అందజేత వంటి అనేక కార్యక్రమాలు మేనిఫెస్టోలో పొందుపరిచారని అన్నారు. పరిగిలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎం. సంతోష్, నాయకులు బి.రవికుమార్, గౌస్పాషా, తాహెర్అలీ, ఆసిఫ్ పాల్గొన్నారు.