సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపిన ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక విద్యార్థులు, కార్మికులు
షాద్నగర్, జూలై 12 : షాద్నగర్ ప్రాంత ప్రజలు, కార్మికులు, విద్యార్థుల స్వప్నం సాకారం కానున్నది. షాద్నగర్ ప్రాంతంలో పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు నానాటికి పెరుగుతుండడం, ఆయా పరిశ్రమల్లో విధులు నిర్వహించేందుకు సరిపడ ఉపాధి స్కిల్స్ లేక ఈ ప్రాంత విద్యార్థులు, కార్మికులు నష్టపోతున్నారు. ఈ సమస్యపై ప్రత్యేక దృష్టిసారించిన ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఐటీఐ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను సీఎం కేసీఆర్కు వివరించి ఆ దిశగా విజయవంతమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ను సోమవారం రాత్రి ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధుల వివరాలను చర్చించారు.
ఈ సందర్భంగా షాద్నగర్ పారిశ్రామిక వాడలో నూతనంగా ఐటీఐ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని, త్వరలోనే కళాశాల ఏర్పాటుకు సంబంధించిన ప్రొసీడింగ్, నిధులు, కళాశాల నిర్మాణ వివరాలు వెల్లడిస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. గత దశాబ్ధాదాల కాలంగా స్థానిక విద్యార్థులు, కార్మికులు ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, అందుకు సీఎం కేసీఆర్ ఆంగీకరించి, నిధులను విడుదల చేస్తామని చెప్పడం సంతోషకరమని పేర్కొన్నారు. అదేవిధంగా పాత జాతీయ రహదారి విస్తరణ పనులను పూర్తిస్థాయిలో పూర్తిచేసేందుకు మరో రూ. 40 కోట్ల నిధులు అవసరమవుతాయని సీఎం కేసీఆర్కు వివరించగానే ఆ నిధులను కూడా విడుదల చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాలు, షాద్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అదనంగా నిధులను కేటాయించాలని కోరినట్లు వివరించారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్, పలువురు టీఆర్ఎస్ ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.