నమస్తే తెలంగాణ, నెట్వర్క్; పదో తరగతి పరీక్షలు మంగళవారం ముగియడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు. ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొంటూ ఆనందాన్ని పంచుకున్నారు. మరోపక్క పాఠశాల రోజులు ముగిసిపోయామని.. ఎవరెవరూ ఏ ఏ కాలేజీల్లో చేరుతామోనని భారంగా వీడ్కోలు చెప్పుకున్నారు. తీపి జ్ఞాపకాలుగా గుర్తుంచుకునేందుకు సెల్ఫీలు తీసుకున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం చివరి పరీక్ష కావడంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఆనందంగా బయటకొచ్చి సంతోషంగా ఎగిరి గంతులేశారు. పరీక్షలు బాగా రాశామని స్నేహితులతో మాట్లాడుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని.. ఆలింగనాలు చేసుకున్నారు. విద్యార్థులందరూ కలిసి సెల్ఫీలు..గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. అనంతరం తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా వీడ్కోలు చెప్పుకుని తమ, తమ ఇండ్లకు వెళ్లిపోయా రు.