సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతి సత్ఫలితాలనిస్తున్నది. పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ.. ముళ్ల పొదల తొలగింపు, మున్సిపాలిటీల్లో నర్సరీలు, పార్కులు, డంపింగ్ యా ర్డులు, వైకుంఠధామాల ఏర్పాటు.. పార్కుల్లో ఓపెన్ జిమ్లు, విద్యుత్తు సమస్యల పరిష్కారం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధిలైట్ల ఏర్పాటు, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం.. ఇలా పలు అభివృద్ధి పనులతో మున్సిపాలిటీల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట, తుర్కయాంజాల్, ఆమనగల్లు, షాద్నగర్, కొత్తూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటైన నర్సరీలు, పట్టణ ప్రకృతివనాలు, ఎఫ్ఎస్టీపీ నిర్మాణాలు మున్సిపాలిటీల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ఎంతో దోహదం చేస్తున్నాయి. గత సమస్యలకు చరమగీతం పాడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా ఠంచనుగా విడుదల చేస్తున్న నిధులను పాలకవర్గాలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు జిల్లాకు పట్టణ ప్ర గతి కింద రూ.128 కోట్ల నిధులు మంజూరు కాగా అందులో రూ. 77 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా 19 వైకుంఠధామాల నిర్మాణానికి రూ.19 కోట్లు వెచ్చించారు. ఇప్పటివరకు జిల్లాలో 257 అర్బన్ పార్కుల నిర్మాణం పూర్తైంది.
-రంగారెడ్డి, జూన్ 15(నమస్తే తెలంగాణ)
“తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పట్టణ ప్రగతి’తో పుర ‘పాలన’ కొత్త పుంతలు తొక్కుతున్నది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో గత నాలుగు విడుతల్లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయి. అధికారుల చొరవ.. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అన్ని శాఖల కలబోతల వికాసంతో మున్సిపాలిటీల రూపురేఖలు మారిపోయాయి. పట్టణ ప్రజల మానసిక ప్రశాంతత కోసం మినీ ట్యాంక్ బండ్, పట్టణ ప్రకృతి వనాలు.. చివరి మజిలీ కష్టాలు గట్టెక్కించేందుకు వైకుంఠధామాలు.. పరిశుభ్రత, సేంద్రియ ఎరువుల తయారీకి వర్మీకంపోస్టు యార్డులను ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలోనూ ఏర్పాటు చేయడంతో మున్సిపాలిటీల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. అభివృద్ధి, మౌలిక సదుపాయాలతోపాటు పచ్చదనం, పరిశుభ్రతతో సీఎం కేసీఆర్ స్వప్నం రంగారెడ్డి జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలోనూ సాకారమైంది.”
-రంగారెడ్డి, జూన్ 15(నమస్తే తెలంగాణ’
వికారాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. మున్సిపాలిటీల్లో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న విద్యుత్తు, డ్రైనేజీ తదితర సమస్యలను పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఒక్కొక్కటిగా పరిష్కారం చూపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పారిశుధ్య పనులతో జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు స్వచ్ఛ మున్సిపాలిటీలుగా రూపుదిద్దుకున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేసిన పారిశుధ్య పనులతోపాటు ముళ్ల పొదలను తొలగించారు. మున్సిపాలిటీలో నర్సరీలను ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. పార్కులు ఏర్పాటు చేయడం, వాటిలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. పాడుపడిన బావులను, పాత భవనాలను కూల్చి వేశారు.
విద్యుత్తు సమస్యలను పరిష్కరించారు. డంపింగ్ యార్డులను, వైకుంఠధామాలను నిర్మించారు. అలాగే నాలుగు మున్సిపాలిటీల్లోని ప్రతీ వార్డులో సీసీ రోడ్లను నిర్మించారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి స్వచ్ఛ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దారు. జిల్లాలోని నాలగు మున్సిపాలిటీల్లో విద్యుత్తు సమస్యలను పరిష్కరించారు. వీధి లైట్ల ఏర్పాటు, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, బీటీ రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తులు తదితర పనులు పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దారు. అయితే పట్టణ ప్రగతిలో భాగంగా నాలుగు మున్సిపాలిటీలకు నెలకు రూ.4.50 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులిస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులతో జిల్లాలోని మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా అవార్డులను తాండూర్, వికారాబాద్ మున్సిపాలిటీలు దక్కించుకున్నాయి.
ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్లు…
ప్రతి పట్టణంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పట్టణ ప్రగతిలో భాగంగా హరితహారం తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ప్రజలకు మరిన్ని వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. పట్టణాల్లో ఎలాంటి వసతులు లేని ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ప్రస్తుతం కూరగాయలను విక్రయిస్తుండగా, ఫుట్పాత్లపై, మురుగు కాల్వలపై మటన్, చికెన్, చేపలను విక్రయిస్తున్నారు. అయితే ఈ విధానానికి స్వస్తి పలికి అన్ని వసతులు కలిగిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు నిధులిచ్చింది. ఇందులో భాగంగానే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు రూ.19.60 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అత్యాధునిక వసతులతో ఉండేలా నిర్మిస్తున్నారు. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లలో పండ్లు, పూలు, మటన్, చికెన్ చేపలను విక్రయించేందుకు ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కూరగాయలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ విక్రయించే కూరగాయలతోపాటు తదితరాలు తాజాగా ఉండేందుకు కోల్డ్ స్టోరేజీని సైతం నిర్మించనున్నారు. మార్కెట్లోకి వచ్చే ప్రజలకు తాగునీటి వసతికి ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. కూరగాయలను కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి కూరగాయల ధరలు తెలిసేలా మార్కెట్లోకి వచ్చే ద్వారం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పూర్తిగా నిఘా నీడలోకి తీసుకొచ్చేందుకు సమీకృత మార్కెట్ అంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
‘పట్టణ నగరీకరణలో గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి ‘పట్టణ ప్రగతి’లో పెద్ద పీట వేసింది. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చి నిధులను అందించి మున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, పెద్ద అంబర్ పేట్, తుర్కయాంజాల్, ఆమనగల్లు, షాద్నగర్, కొత్తూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటైన నర్సరీలు, పట్టణ ప్రకృతి వనాలు, ఎఫ్ఎస్టీపీ నిర్మాణాలు, వర్మీకంపోస్టు యార్డులు మున్సిపాలిటీల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ఎంతో దోహదపడుతున్నాయి. ఇవన్నీ గత సమస్యలకు చరమగీతం పాడుతున్నాయి. నగరాలకు మణిహారంలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడంతో మున్సిపాలిటీల రూపు రేఖలే సమూలంగా మారిపోయాయి.
అంతిమ సంస్కారాల ఇబ్బందులకు చరమగీతం
అంతిమ సంస్కారాల సందర్భంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు ప్రతి మున్సిపాలిటీలోనూ వైకుంఠధామాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దహన సంస్కారాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు స్నానాల కోసం గదులను సైతం నిర్మించారు. గతంలో వైకుంఠధామాలు లేక అంత్యక్రియలను పొలం గట్ల వెంట, ఊరి శివార్లలో ఎక్కడ పడితే అక్కడే చేసేవారు. ప్రస్తుతం చాలాచోట్ల వైకుంఠధామాల నిర్మాణాలు అందుబాటులోకి రావడంతో పట్టణాల్లో దహన సంస్కారాల సమస్య చాలా వరకు తీరింది.
జీవ వైవిధ్యానికి నెలవులుగా ప్రకృతి వనాలు
మానసికోల్లాసం, శారీరక దృఢత్వం కోసం ప్రతి మున్సిపాలిటీలో పట్టణ ప్రకృతి వనాలను, ఓపెన్ జిమ్ పార్కులను ఏర్పాటు చేశారు. రకరకాల మొక్కలను నాటడంతోపాటు వాకింగ్ ట్రాక్ను ప్రతి వనంలో అందుబాటులోకి తెచ్చారు. ఆమనగల్లు పట్టణంలో రూ.65లక్షలతో 4 నర్సరీలు, 15 పట్టణ ప్రకృతి వనాలను, 19 కి.మీ.ల మేర ఎవెన్యూ, మిడియన్, ఎంఎల్ఏపీ ప్లాంటేషన్ను చేపట్టారు. అలాగే ఆదిబట్లలో రూ.51లక్షలతో 19 పట్టణ ప్రకృతి వనాలు, 5 నర్సరీలు, రెండు పార్కులు, 12 కి.మీ.లు ప్లాంటేషన్ను, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలో రూ.72లక్షలలో నర్సరీలు, పట్టణ ప్రకృతి, ట్రీ పార్కులు, ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో రూ.49లక్షలతో 6 ఓపెన్ జిమ్ పార్క్లు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. తుర్కయాంజాల్లో రూ.83లక్షలతో ఓపెన్ జిమ్ పార్క్లను ఏర్పాటు చేశారు. విరివిగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడంతో ఎక్కడ చూసినా పచ్చదనం వెల్లివిరుస్తున్నది. జీవవైవిధ్యానికి నెలవుగా ఉన్న ప్రకృతి వనాలు పట్టణ ప్రజానీకాన్ని ఆహ్లాదంలో ముంచెత్తుతున్నాయి.
పరిశుభ్రతకు కేరాఫ్గా…
మున్సిపాలిటీల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డులను, డీడీఆర్సీ నిర్మాణాలను, మల వ్యర్థాలను సురక్షితంగా శుద్ధి చేయడానికి ఎఫ్ఎస్టీపీ నిర్మాణాలను చేపట్టింది. గడపగడపకూ సేకరించిన చెత్తను సేకరించి ఎప్పటికప్పుడు ఆటోల్లో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఆ చెత్తను వర్మీకంపోస్టుగా మార్చి హరితహారం మొక్కలకు, పొలాల్లో ఎరువులుగా రైతులకు అందిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణతో చెత్త తరలింపు ప్రక్రియ నిర్విఘ్నంగా సాగుతుండడంతో పరిశుభ్రత మెరుగుపడి వీధులన్నీ అద్దంలా మెరుస్తున్నాయి.
నాలుగు విడుతల్లో..
నాలుగు విడతల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం మున్సిపాలిటీల స్వరూపాన్ని సమూలంగా మార్చివేసింది. నాలుగు విడుతల్లో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ప్రజల ముంగిటకు ప్రగతి ఫలాలు అంది వచ్చాయి. ప్రస్తుతం ఏ మున్సిపాలిటీని చూసినా పచ్చదనంతోపాటు, పరిశుభ్రమైన వీధులు కన్పిస్తున్నాయి. గుంతలను పూడ్చడం, పిచ్చిచెట్లను కొట్టివేయడం, కూలిపోయే దశలో ఉన్న పాత ఇండ్లను కూల్చివేయడం, పాడుబడ్డ బావులు, బొందలను పూడ్చడం, వేలాడుతూ ఉన్న కరెంటు తీగలను సరిచేయడం, రోడ్ల మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలను మార్చడం, శిథిలమై, వంగిపోయిన స్తంభాలను మార్చడం తదితర పనులను నిరంతరాయంగా చేపట్టడంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. నాలుగు విడుతల్లో చేపట్టిన పట్టణ ప్రగతి పనులతో పట్టణ ప్రగతికి ముందు.. ఆ తర్వాత అన్నట్టుగా మున్సిపాలిటీల్లో పరిస్థితులు మారిపోయాయి.
స్వచ్ఛతకు అవార్డులు..
జిల్లాలోని మున్సిపాలిటీలు స్వచ్ఛతలో ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ స్థాయిని సాధించాయి. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ సౌత్ జోన్లో 25వేల జనాభాతో శీఘ్రంగా ఎదుగుతున్న పట్టణాల జాబితాలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ జాతీయ స్థాయి అవార్డును అందుకున్నది. పారిశుధ్యం మెరుగులో ఆమనగల్లు మున్సిపాలిటీ స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డును పొందగా.. ఆదిబట్ల మున్సిపాలిటీ సెల్ఫ్ సైస్టెనబుల్ అవార్డును పొందింది.