యాచారం, మార్చి 24: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఐ శంకర్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ముమ్మరంగా దాడులు నిర్వహించి మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిపై కేసులను నమోదు చేసినట్లు గుర్తు చేశారు. మండలంలో గున్గల్, యాచారం, మాల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యంగా మాల్లో ఉన్న బార్డర్ చెక్పోస్టును పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున రూ.50 వేలకు మించి నగదు తీసుకుపోవద్దని ఆయన సూచించారు. అత్యవసరంలో అధిక మొత్తంలో నగదు తీసుకెళ్తే సంబంధిత రశీదులు ఉండాలని తెలిపారు. మద్యం, బంగారం, నగదు తరలింపుపై నిఘా ఉంచినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేయొద్దని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.