న్యూస్ నెట్వర్క్,నమస్తే తెలంగాణ ; ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెబుతూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. వానకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులు, వాటి లక్షణాలపై అవగాహన కలిగి ఉంటే వాటి నుంచి బయట పడవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు.
చికున్ గున్యా..
చికున్ గున్యా జ్వరం దోమ కాటుతో వస్తుంది. ఇది ఎడిస్ అనే దోమతో వ్యాప్తి చెందుతుంది. తలనొప్పి, వాంతులు, వికారంతోపాటు హఠాత్తుగా జ్వరం వస్తుంది. చేతి వేళ్లు, కాళ్ల నుంచి మొదలు శరీరంలోని అన్ని కీళ్లను బాధిస్తుంది. సరిగ్గా నిలబడలేని పరిస్థితి. జ్వరం తగ్గినా నొప్పులు ఎక్కువ కాలం ఉంటాయి. చికున్గున్యా సోకితే మొదటి రెండు, మూడ్రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఎడిస్ అనే దోమలు అధికంగా ఇంటి పరిసరాల్లోనే ఉంటాయి. పాత్రలు, ప్లాస్టిక్ వస్తువులు, పూలకుండీలు, డ్రమ్ములు, టైర్లు, ఎయిర్ కూలర్లు, చెట్టుతొర్రలో అధికంగా ఉంటాయి.
నివారణ చర్యల్లో వైద్య సిబ్బంది..
ప్రజలు వ్యాధి బారిన పడకుండా వైద్యాధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వానకాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వ్యాధులు ప్రబలే ముప్పు పొంచి ఉందని వైద్య సిబ్బంది నివారణ చర్యలు చేపట్టింది.
సాధారణ జ్వరం, జలుబు..
సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిములతో వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. గాలి, నీటి ద్వారా మానవ శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. వైరస్ రకాన్ని బట్టి జ్వరం ఉంటుంది. జ్వరంతోపాటు కొంతమందికి దగ్గు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వైరల్ జ్వరం మూడు నుంచి వారం వరకు ఉంటుంది.
హైపటైటిస్-ఏ..
వానకాలంలో హైపటైటిస్-ఏ(కామెర్లు) వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది కాలేయ కణాల్లో సంక్రమణతో కలుగుతుంది. ఈ వ్యాధి సూక్ష్మక్రిములు కలుషితమైన ఆహార పదారాలు, తాగునీటి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాలేయ వ్యాధి కారణంగా బైలురుబిన్ పరిమాణం పెరుగుతుంది. ఈ కారణంగా శరీర భాగాలు పసుపు రంగులో కనిపిస్తాయి.
డెంగీ..
వైరల్ ఫీవర్ మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. పగలు కుట్టే ఎడిస్ అనే దోమలతో వస్తుంది. ఇది ఒక సాధారణ వైరస్ జ్వరం. తగ్గినట్లు అనిపించి వారం, పది రోజుల్లో మళ్లీ తిరగబెడుతుంది. తలనొప్పి, ఒంటినొప్పి, కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావంతో కాళ్లు, చేతులు, ముఖం, వీపు, ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కందినట్లు చిన్న చిన్న కురుపులు కనిపిస్తాయి. కండ్ల నొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు, జ్వరం లక్షణాలు ఉంటాయి.
మలేరియా..
ఆడ అనాఫిలిస్ అనే దోమ కుట్టడంతో మలేరియా సోకుతుంది. మలేరియా రోగిని దోమకుట్టి రక్తం పీల్చినప్పుడు రోగ కారకమైన పరాన్నజీవి దాని కడుపులోంచి ప్రవేశించి పెరుగుతుంది. ఆ దోమ మరో వ్యక్తిని కుట్టినప్పుడు పరాన్నజీవి ఆ వ్యక్తి రక్తంలోకి చేరి వ్యాధి సంక్రమింపజేస్తుంది. మలేరియా వ్యాధి నాలుగు రకాలుగా ఉంటుంది. ప్లాస్మోడియం వివక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఓవలే. చివరి రెండు రకాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
పైలేరియా వ్యాధి..
పైలేరియా క్యూలెక్స్ దోమతో వ్యాప్తి చెంది ఎవరికైనా సోకే ప్రమాదముంటుంది. తరుచూ వచ్చే జ్వరం, సంకలు, గజ్జల్లో బిల్లలు కట్టడం, వెదురు పాముతో మొదలై క్రమేణా అవయవాల వాపునకు దారి తీస్తుంది. ప్రత్యేకించి కాళ్లు, చెతులు, వరబీజము, జ్ఞానేంద్రియాలు పాడవ్వడం ఈ వ్యాధి ముఖ్యలక్షణాలు.
ప్రతి శుక్రవారం డ్రై డే..
వానకాలంలో విషజ్వరాలు వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కువ. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో జూలై నుంచే ప్రతిష్టాత్మకంగా ప్రతి శుక్రవారం డ్రై డే పేరుతో పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. నిల్వ ఉన్న నీటిని తొలగించడం, పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
అందుబాటులో వైద్య సిబ్బంది
ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆశ కార్యకర్తలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యులు, హెల్త్ అసిస్టెంట్లు, మెడికల్ ఆఫీసర్, ఏపీఎంఓ, సీహెచ్ఓ, ఫార్మాసిస్ట్, పీహెచ్ఎన్,హెచ్ఈఓలు, సూపర్వైజర్లు అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
అప్రమత్తతే ప్రధానం..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చంటున్నారు. ఇండ్ల ఎదుట వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, జన సమూహం ఎక్కువగా ఉన్న చోట తిరగరావద్దని పేర్కొంటున్నారు. వర్షంలో తడవకుండా చూసుకోవాలని, మాస్క్ ధరించడంతో వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చంటున్నారు. తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని తెలుపుతున్నారు. దోమలతో సోకే వ్యాధులపై వైద్య సబ్బంది ప్రజలలకు అవగాహన కల్పిస్తున్నారు. జ్వరాలు సోకినవారి నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేయించి, మందులతో పాటు సలహాలు, సూచనలు చేస్తున్నారు.
మెదడు వాపు వ్యాధి..
మెదడువాపు వ్యాధి క్యూలెక్స్ అనే దోమ కుట్టడంతో వ్యాపిస్తుంది. ఈ వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఎక్కువగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాలుగు నుంచి 12ఏండ్ల లోపు వయసున్న పిల్లల్లో వస్తుంది. హఠాత్తుగా జ్వరంతో కూడిన ఈ వ్యాధి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. పంట పొలాల్లోని నీటిలో ఈ దోమ నివసిస్తుంది.
టైఫాయిడ్..
వర్షకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నది. ఇది సాల్మోనెల్లా టైపీ బాక్టీరియాతో వస్తుంది. కలుషిత నీరు తాగడం, కలుషిత ఆహారం తినడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..