రంగారెడ్డి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, తుది ఓటర్ జాబితా, బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్ నివేదికలు సకాలంలో పంపించడంపై జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటరుగా నమోదైన ఉపాధ్యాయుల వివరాలు ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్ల వివరాలను తక్షణమే అప్లోడ్ చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లయితే, సంబంధిత బృందాలు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాలకు సంబంధించి వెరిఫికేషన్ రిపోర్టు పంపించాలని, బ్యాలెట్ బాక్స్లను నేరుగా కౌంటింగ్ కేంద్రానికి పంపించే విషయమై తెలిపారు. ఈ సందర్భంలో రంగారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి హరీశ్ మాట్లాడుతూ.. ఓటర్లుగా నమోదైన ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల వివరాలను తక్షణమే అప్లోడ్ చేస్తామని.. ఎపిక్ అనుసంధానం, ఆదేశాలను పాటించడం జరుగుతున్నదని తెలిపారు.