మొయినాబాద్ : ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవడానికి విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేయడంతో శనివారం పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులకు పట్టాలను ప్రధానం చేయడంతో పాటు కళశాల టాపర్గా, ఆయా బ్రాంచిలలో టాపర్గా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను కష్టపెట్టిన ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని మంచి భవిష్యత్ కోసం కష్టపడాలని సూచించారు.
జీవితంలో ఎంత నేర్చుకున్న తక్కువేనని అన్నారు. జీవితంలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకుంటే ఉన్నత శిఖరాలను అదిరోహించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జేఎన్టీయూ ప్రొపెసర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ వినూత్నమైన ఆలోచనలతో కూడిన విద్య ప్రస్తుతం ప్రపంచీకరణలో చాలా అవసరం అని చెప్పారు. సాంకేతిక విద్యలో ఎప్పటికప్పుడు పెను మార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా అప్డేట్ కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ రోహిత్ కందకంటి, ప్రిన్సిపాల్ జాగీర్దార్, ఏవో రవికిరణ్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.