షాబాద్, ఏప్రిల్ 9: పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సుమారు 200 మంది బీఎస్పీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పదేండ్ల కాలంలో అన్ని వర్గాలకూ పెద్దపీట వేశారన్నారు. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున చేరడం సంతోషకరమన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్తు చైర్మన్గా, ఎమ్మెల్సీగా పని చేశారన్నారు.
ఈ నెల 13న చేవెళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ ఉన్నదని, పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా తనకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని, మీరందరూ ఆశీర్వదించాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి గత 40 ఏండ్లుగా కృషి చేస్తున్నానని తెలిపారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని కోరారు.
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలిచిన వారికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో పదవులు అనుభవించి బయటకు వెళ్లిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు అందరూ కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, మాజీ ఎంపీపీ మంగలి బాల్రాజ్, ఆయా నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.