నవాబుపేట, ఏప్రిల్ 28: అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఏక్మామిడి బంగారు మైసమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మండల పరిధిలోని మహ్మదాన్పల్లి, కుమ్మరిగూడ, గేట్వనంపల్లి గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదో పొరపాటున అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు.. మళ్లీ మోసపోకండని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా వినిపించాలంటే కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇంకా పాత పింఛన్లను ఇస్తున్నారని, పెంచి ఇస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారని ఎమ్మెల్యే యాదయ్యపేర్కొన్నారు. రూ.500లకే గ్యాస్ ఇస్తామన్నారు.. దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ విషయాన్ని మహిళలు గమనించి ఓటు వేయాలని సూచించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేసామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెసోళ్లు ఇప్పటివరకు రూపాయి కూడా మాఫీ చేయకుండా ఆగస్టులో చేస్తామని ఓట్ల కోసం కొత్త రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరాను కట్ చేస్తున్నారని.. కాంగ్రెస్ అంటే కటింగులు తప్ప సేవింగ్లు ఉండవని పాతాకాలం నాటి రోజులను కాంగ్రెస్ నాయకులే గుర్తు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని ఓటర్లను వేడుకున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల నుంచి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే అని ఎమ్మె ల్యే యాదయ్య అన్నారు. వీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ రం గులు మారుస్తూ జంపు చేస్తున్నారని, వారికి ఓటు వేస్తే రేపు మరో పార్టీలోకి మారరనే గ్యారెంటీ ఏమీ లేదన్నారు. ఇలాంటి వారికి ఓటు వేసి మోసపోవద్దని కోరారు. బీఆర్ఎస్ హయాంలో సరైన సమయానికి రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, బాలింతలకు పౌష్టికాహారం, బతుకమ్మ చీరలు తదితర పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
చేవెళ్ల లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే యాదయ్య కోరారు. ఈ నియోజకవర్గంలో బీసీలకు అవకాశం ఇవ్వడం హర్షణీయమన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్పై ఎంతో నమ్మకంతో బీఫామ్ ఇచ్చి బరిలో నిలిపారని అందరం కలిసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపిద్దామని కోరారు. గతంలో కాసాని ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ చైర్మన్గా ఉన్న సమయంలో ప్రజలకు అందించిన సేవలను ఓటర్లకు వివరించారు.
అంతకు ముందు చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి బాబురావు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రజలను అనేక రకాలుగా మభ్యపెట్టి గద్దెనెక్కారని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా గ్రామాల్లో కరెంట్ కోతలు ఉండేవి కావన్నారు. ఇప్పుడు రాత్రి సమయంలో గంటల తరబడి కోతలు విధిస్తున్నారని గుర్తు చేశారు. పెంచుతామన్న ఆసరా పింఛన్ను ఇంకా పెంచలేదని, మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలోనూ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయన్నారు. ఈసారి ఓటు వేసే ముందు అన్ని రకాలుగా ఆలోచించి ఓటు వేయాలని, మళ్లీ మోసపోవద్దని సూచించారు.
మూడు గ్రామాల్లోనూ గ్రూపులుగా వీడిపోయి ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు జోరుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దయాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, ఎంపీటీసీ విజయ్ కుమార్, యూత్ నేతలు తెలుగు రాఘవేందర్, శాంతి కుమార్, వెంకట్రెడ్డి, కాలె రవికాంత్, పోలీస్ మహేశ్రెడ్డి, మాజీ సర్పంచులు పద్మాశ్రీనివాస్, డెక్క పద్మ, రత్నం, బల్వంత్రెడ్డి, న్యాలం విజయలక్ష్మీప్రకాశ్, బీఆర్ఎస్ బీసీ సెల్ నేత డెక్క మాణెయ్య, వికారాబాద్ కరుమ సంఘం ఉపాధ్యక్షుడు రాఘవేందర్ పాల్గొన్నారు.