నవాబుపేట, మార్చి 22 : తాను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు కొందరు పని గట్టుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, గులాబీ పార్టీని వీడే ప్రసక్తే లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించారని దీనిని వమ్ముచేసి వేరే పార్టీలోకి ఎలా వెళ్తానని అన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్కు కేసీఆర్ అవకాశం కల్పించారని, వారిని అధిక మెజార్టీతో గెలించేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. జ్ఞానేశ్వర్ జడ్పీ చైర్మన్గా ప్రజలకు ఎన్నో సేవలు చేశారని గురు చేశారు. ఒక బీసీ బిడ్డకు కేసీఆర్ ఎంపీగా అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. జ్ఞానేశ్వర్ను ఎంపీగా గెలిపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. మరోసారి చేవెళ్ల గడ్డపై గులాబీ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.