చేవెళ్ల టౌన్ : రైతుల పక్షపాతి, మనసున్న మనిషిగా సీఎం కేసీఆర్ రూ. 50వేల కోట్లు రైతుబంధు రైతుల ఖాతాల్లో వేసి వారిని ఆదుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ముఖ్య అతిథిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ముందుగా ఎడ్లబండి ఎక్కి రైతులకు, ప్రజలకు అభివాదం చేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఇంద్రన్న విగ్రహం వద్ద జరిగిన సభలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే గొప్ప పథకం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఒకవైపు ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వేస్తామన్న రూ. 15లక్షలు ఎక్కడ ఉన్నాయన్నారు.
ప్రభుత్వంపై లేని పోనివి మాట్లాడే ప్రతిపక్ష నేతలు నేడు అన్ని రకాల రాష్ర్ట ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారని వారికి అభివృద్ధి, సంక్షమ పథకాలు కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. పార్టీలు, కుల, మతాలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ. 10,500 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ. లక్ష కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ. 16 వేల కోట్లు మొదటి విడుతలో రూ. 732 కోట్లు రెండో విడతలో ఖర్చు చేసిన గొప్ప రైతు ప్రభుత్వం మనదన్నారు. ఇప్పటి వరకు రూ. 3535 కోట్లు రైతు బీమా 70వేల రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించిందన్నారు. 2604 రైతు వేదికల కోసం రూ. 672కోట్లు, లక్ష రైతు కల్లాల నిర్మాణం కోసం రూ. 750కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రైతును రాజుగా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోనే, దేశంలోనే ప్రథములని తెలిపారు.
ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ..
రైతుబంధు అందిస్తున్న సీఎం కేసీఆర్కు చేవెళ్ల ప్రజల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని, పల్లెప్రగతితో నేడు పల్లెల రూపురేఖలు మారి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రైతుబంధు దేశానికి ఆదర్శమని, రైతులు రాష్ర్టంలో సంతోషంగా ఉన్నారని, రైతుకు వెన్నుదన్నుగా రాష్ర్ట ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. ప్రతి పక్షాలకు బుద్ధి చెప్పేవిధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రైతులు, యావత్ ప్రజానికం అండగా నిలువాలని కోరారు. అనంతరం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, చేవెళ్ల జడ్పీటీసీ మర్పల్లి మాలతికృష్ణారెడ్డి, మొయినాబాద్ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, చేవెళ్ల మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శివనీల, చేవెళ్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్రెడ్డి, మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి హన్మంత్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి, దేవుని ఎర్రవల్లి సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి, ముడిమ్యాల సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.