చేవెళ్ల రూరల్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆదర్శ పాఠశాలలో 2022-2023 సంవత్సరానికి గాను ఆన్లైన్ ద్వారా ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చేవెళ్ల ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ టెనావతి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ విద్యారంగంలో వెనుకబడిన పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలనే దృక్పథంతో 2022-23 సంవత్సరానికిగాను ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఏదో తరగతి నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఆన్లైన్ దరఖాస్తులకు ప్రకటన జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, వసతి, దుస్తుల పంపిణీ, సైన్స్, కంప్యూటర్ ప్రయోగశాల, డిజిటల్ తరగతులు వివిధ విద్య ప్రవేశ పరీక్షలకు శిక్షణ, పిల్లల మానసిక నైపుణ్య అభివృద్ధి కోసం గ్రంథాలయం, వివిధ సాంస్కృతిక, వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యార్థులకు కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జాతీయస్థాయి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షకు కోచింగ్ ఇవ్వబడుతుందని తెలిపారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు క్రీడలకు శిక్షణ కూడా అందించడం జరుగుతుందన్నారు. సీట్ల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ రిజర్వేషన్ ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.