చేవెళ్ల టౌన్ : మన ఆరోగ్యశ్రీ పథకాన్ని చూసే కేంద్రం అయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి జనరల్ దవాఖానలో ఆరోగ్యశ్రీ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాల్లో ఆసరాగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం చూసే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
పట్నం మహేందర్ జనరల్ దవాఖానలో ఆరోగ్యశ్రీని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో త్వరలోనే ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభం కాబోతుందని తెలిపారు. త్వరలోనే వికారాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల రాబోతుందని, దీంతో ఇక్కడి మెడిసిన్ చదివే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పట్నం మహేందర్రెడ్డి జనరల్ దవాఖానలో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గాడ్యుయేట్స్ విద్యార్థుల మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు, నిర్వాహకులకు సూచించారు.
ఉచిత అంబులెన్స్ల సేవలు..
అనంతరం ఎంపీ రంజిత్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలో చేవెళ్ల, వికారాబాద్లో సొంత ఖర్చులతో ఉచిత అంబులెన్స్ల సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అంబులెన్స్ సేవలు ప్రజలకు సకాలంలో అందేలా ఒక హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలని పట్నం మహేందర్ జనరల్ దవాఖాన నిర్వాహకులకు సూచించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశమని, పేద ప్రజలు అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం..
చేవెళ్ల మండల కేంద్రంలో నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు అందించే దిశగా స్కిల్ డెవెలప్మెంట్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నామని ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. వికారాబాద్, చేవెళ్లకు చెందిన నిరుద్యోగ యువత స్కిల్ డెవెలప్మెంట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. మెకానికల్ ఫిట్టర్, ఎలక్టికల్ వైరింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ వాటిలో శిక్షణ ఇస్తామని, ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తున్నామని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. చేవెళ్ల, వికారాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్నం మహేందర్ జనరల్ దవాఖాన సీఈవో సత్యనారాయణ, సెక్రటరీ సంతోశ్రెడ్డి, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.