తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న లోక్సభ స్థానాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2019 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తక్కువ ఓటు శాతం నమోదైన నియోజకవర్గాలను ఈసీ గుర్తించగా.. అందులో చేవెళ్ల పార్లమెంట్ స్థానం ఉన్నది. ఈసీ మార్గనిర్దేశం మేరకు ఇక్కడ ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేస్తున్నది. స్వీప్ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బుధవారం 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోపక్క కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
-రంగారెడ్డి, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ)
లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ స్థానం పరిధిలో తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తున్నది. ఈ ఎంపీ స్థానంలో చాలావరకు అసెంబ్లీ నియోజకవర్గాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ పరిధిలో 60.05 శాతం నమోదు కాగా.. 2019 ఎన్నికలకు వచ్చేసరికి పోలింగ్ శాతం 53.22 శాతానికి తగ్గింది. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రంగారెడ్డి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ నమోదైంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదుకాగా.. 2023 ఎన్నికల్లో 59.96 శాతం మాత్రమే నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈ రెండు ఎన్నికల మధ్య పోలింగ్ శాతం తగ్గింది. తాజా ఎన్నికల్లో.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 74.93 శాతం, ఎల్బీనగర్ పరిధిలో 49.07, మహేశ్వరంలో 55.39, రాజేంద్రనగర్లో 55.83, శేరిలింగంపల్లిలో 48.75, చేవెళ్ల పరిధిలో 74.18, కల్వకుర్తిలో 83.26, షాద్ నగర్లో 82.09 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ రోజున పట్టణ వాసులు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా యువత ఓటేసేందుకు ఆసక్తి చూపడంలేదు. పోలింగ్ రోజున సెలవు ప్రకటించడంతో చాలామంది సెలవు దినాన్ని ఓటు హక్కుకోసం వినియోగించుకోక ఇంటి పట్టునే ఉంటున్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లను వేర్వేరు పోలింగ్ బూతులకు కేటాయించడం, క్యూలో వెయిట్ చేయడం వంటి కారణాలు తక్కువ ఓటింగ్కు కారణమవుతున్నాయని ఎన్నికల సంఘం గుర్తించింది.
ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతోపాటు, ముఖ్యంగా యువతను ఇందులో భాగస్వామ్యులను చేసేలా ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మూడంచెల వ్యూహాన్ని అమలు చేయనున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భిన్నమైన వ్యూహాలను అమలుపర్చనున్నారు. పోలింగ్ బూతుల్లో క్యూ నిర్వహణ, వాహనాల పార్కింగ్ వసతులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్థానిక ప్రముఖులు, యువతపై ప్రభావం చూపే వ్యక్తుల ద్వారా ఓటర్లను బూత్లకు రప్పించేలా కార్యాచరణను సిద్ధ్దం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపునకు స్వీప్(సిస్టమెటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బుధవారం 2కె రన్ నిర్వహించి ఓటర్లను చైతన్యపర్చారు. విద్యార్థులు, యువతతోపాటు ఐటీ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు హక్కును వినియోగించుకునేలా సమావేశాలు నిర్వహించి ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్నారు.
ఈసారి కొత్తగా పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యులను చేసి ‘తెలంగాణ ఓటరు సంకల్ప పత్రం’ పేరుతో వినూత్న ప్రచారాన్ని అధికారులు చేపడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు సంకల్ప పత్రాలను అందజేసి వారి ద్వారా ఓటు ఆవశ్యకతపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. పత్రాలపై తల్లిదండ్రులతో సంతకాలు చేయించాక తిరిగి ఆ పత్రాలను పాఠశాలల వారీగా స్వీప్ అధికారులు సేకరిస్తున్నారు.
రద్దీ ప్రాంతాల్లో మొబైల్ వాహనాల ద్వారా ఓటు విలువ, పోలింగ్ సమాచారం, ఇతర వివరాలను కళాబృందాలతో విస్తృత ప్రచారాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో ఓటు విలువ తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 15 వరకు కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా అధికారులు చైతన్యపరుస్తున్నారు.