వికారాబాద్, సెప్టెంబర్ 26 : వెట్టిచాకిరి విముక్తి, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని కలెక్టర్ నారాయణరెడ్డి కొనియాడారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాణహాని ఉందని తెలిసి కూడా బలహీన వర్గాలు, మహిళల కోసం పోరాడిన త్యాగశీలి ఐలమ్మ అని పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి ముందు పరిస్థితులు వేరుగా ఉండేవని, ప్రస్తుతం రాజ్యాంగం హక్కులను పొందుతూ ముందుకు సాగాలన్నారు. ప్రపంచీకరణలో భాగంగా కుటుంబాలన్నీ చదువుపైనే ఆధారపడి ఉన్నాయని, గ్రామీణ స్థాయిలో మహనీయుల ఆలోచనా విధానాలపై మేల్కొల్పుతూనే చదువులపై దృష్టి సారించేలా అందరూ పని చేయాలని సూచించారు. కులవృత్తులను నిర్వహించుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరారు. ప్రజల కోరిక మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ మాట్లాడుతూ.. భూమి హక్కులు లేని సమయంలో సామాన్య రైతుల శ్రమను దోపిడి చేస్తున్నారనే కసితో పోరాటం చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. నిజాం రాజులు భూమి శిస్తు మాఫీ చేసినప్పటికీ భూస్వాములు పేదలు పండించిన పంటలను దోచుకోవడంపై ప్రజలను మమేకం చేసి విసునూరు దొరలకు ఎదురొడ్డి పోరాటం చేసిన నిప్పు రవ్వ అని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను కాపాడేందుకు బీసీ బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. చాకలి, మంగలి వృత్తులు చేపట్టేవారికి 250 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, డీబీసీడీవో ఉపేందర్, డీవైఎస్వో హనుమంతరావు, డీటీడబ్ల్యూవో కోఠాజీ, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రాములు, నాయకులు రత్నారెడ్డి, కృష్ణయ్య, రమేశ్, ఆంజనేయులు, అనంతయ్య, రాజేందర్గౌడ్, మల్లేశ్, సత్తయ్య, రాములు, అంజయ్య, దత్తు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. ఐలమ్మ నాటి పెత్తందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి, పేదల కోసం పోరాటం చేసిన వీరనారి అని కొనియాడారు. సాధారణ కుటుంబంలో పుట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహోన్నత మహిళ అని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని చెప్పారు. తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు ఐలమ్మ అని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి విమలాదేవి, జిల్లా అసిస్టెంట్ బీసీ అభివృద్ధి అధికారి నీరజరెడ్డి, బీసీ సంఘం నాయకుడు మల్లేశ్యాదవ్ పాల్గొన్నారు.