2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల పంట పండింది. పారిశ్రామికాభివృద్ధి, రీజినల్ రింగ్రోడ్డు, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడం, మోమిన్పేటలో 1200 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ, తదితర ప్రగతి పనులతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రియల్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. అంతేకాకుండా నగరవాసులు శంకర్పల్లి, మొయినాబాద్, వికారాబాద్ల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. ఫలితంగా వ్యవసాయేతర భూ రిజిస్ట్రేషన్లతో సంబంధిత శాఖకు రూ.3861 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 2,47,704 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 22,708 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరుగగా.. రూ.1008.04 కోట్ల ఆదాయం వచ్చింది.
వికారాబాద్, ఏప్రిల్ 3, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.3861 కోట్ల ఆదాయం జిల్లా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ ఖజానాకు చేరింది. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారానే అధిక ఆదాయం సమకూరింది. ప్రతీ ఆర్థిక సంవత్సరం చివర్లో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగుతున్న దృష్ట్యా గత మార్చి నెలలో కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.400 కోట్లకుపైగా రెవెన్యూ సమకూరింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేగంగా పారిశ్రామికాభివృద్ధి, రీజినల్ రింగ్రోడ్డు, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా బీజాపూర్ జాతీయ రహదారిని విస్తరించడం, మోమిన్పేట్లో 1200 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా లే అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు చాలా వరకు శంకర్పల్లి, మొయినాబాద్, వికారాబాద్ వరకు నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి.
రూ.3,861 కోట్ల ఆదాయం
జిల్లాలోని వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాల ద్వారా జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.3,861 కోట్ల రెవెన్యూ వచ్చింది. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.1008.04 కోట్ల రాబడి చేకూరింది. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అత్యధికంగా రెవెన్యూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అనంతరం గండిపేట్, శేరిలిగంపల్లి, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధిక రెవెన్యూ ప్రభుత్వ ఖజనాకు చేరింది. జిల్లావ్యాప్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2,47,704 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.