సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ చికిత్సా విధానంలో పెను మార్పులు వచ్చాయని.. ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకొని తొలి దశలోనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ప్రభుత్వ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జయలత అన్నారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగడం ఆందోళనకరమే అయినా పెరుగుతున్న నూతన చికిత్సా విధానాలతో కట్టడి చేయగలుగుతున్నారని వివరించారు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినాన్ని పురస్కరించుకొని వ్యాధి తీవ్రత, ఆధునిక పద్ధతులను ‘నమస్తే తెలంగాణ’కు ఆమె వివరించారు.
ప్రస్తుతం 35 ఏండ్లకే..
ఒకప్పుడు 45 ఏండ్లు దాటిన వారు అధికంగా క్యాన్సర్ బారిన పడేవారు. ప్రస్తుతం 35 ఏండ్లు దాటిన వారిలో క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది క్యాన్సర్ రోగులుండగా.. తెలంగాణలో సుమారు లక్ష మంది ఉన్నారు. గతంలో 35 ఏండ్లు దాటిన వారిలో కేవలం 1 నుంచి 2 శాతం మధ్య క్యాన్సర్ రోగులుంటే ప్రస్తుతం ఆ సంఖ్య 20 శాతానికి పెరిగింది.
2030 నాటికి రెట్టింపు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం గడిచిన ఐదేండ్లలో క్యాన్సర్ రోగుల సంఖ్య 20 శాతానికి పెరిగింది. 2030 నాటికి ఈ సంఖ్య 50 శాతం అంటే దాదాపు రెట్టింపయ్యే అవకాశం ఉంది. చికిత్సా విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చినా అవగాహన లోపంతో పరిస్థితి తీవ్రంగా మారుతున్నది.
ప్రపంచ క్యాన్సర్ దినాన్ని పురస్కరించుకొని బొల్లారం తిరుమలగిరి మిలటరీ దవాఖానలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్నల్ నిఖత్ జహన్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పొగాకు, మద్యం వాడమని యూనిట్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. ఇదిలా ఉంటే శనివారం మిలటరీ దవాఖానలో స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్..
ఎంఎన్జే వైద్యశాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి నెలలో 13 క్యాంపులు నిర్వహించి సుమారు 250 నుంచి 300 మందికి స్క్రీనింగ్ చేస్తున్నాం. ఎక్కువగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలపై దృష్టి సారించాం. 2022లో మొత్తం 10వేల మందికి పరీక్షలు జరిపి ఇందులో 283 మందికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించాం. సాధారణంగా క్యాన్సర్ లక్షణాలు రెండు, మూడో దశల్లోనే బయటపడుతాయి. కొన్ని క్యాన్సర్ల లక్షణాలు తొలి దశలో బయటపడినా అవగాహన లేకపోవడంతో గుర్తించలేకపోతున్నారు.
క్యాన్సర్ రోగులకు అధునాతన చికిత్సలు అందించడంలో భాగంగా ఎంఎన్జేలో అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 7 మాడ్యులర్ థియేటర్స్ అందుబాటులోకి తెచ్చాం. అతి త్వరలోనే రోబోటిక్ థియేటర్ అందుబాటులోకి రానుంది. మాలిక్యులర్ అంకాలజీ విభాగంతో పాటు అత్యాధునిక పెట్-సీటీ-128ైస్లెస్ అందుబాటులోకి తీసుకువచ్చాం. 150 పడకలతో చిన్న పిల్లల కోసం ప్రత్యేక వార్డు, 50 పడకలతో పాలియేటివ్ కేర్ను ప్రారంభించాం. మరో 300 పడకలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి.
మొదటి స్థానంలో రొమ్ము క్యాన్సర్..
ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా.. గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ రెండోస్థానం.. ఓరల్ క్యాన్సర్ మూడో స్థానంలో ఉన్నాయి. 2021తో పోలిస్తే రొమ్ము క్యాన్సర్ 12 శాతం నుంచి 13 శాతానికి పెరిగి రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకింది. ఓరల్ క్యాన్సర్ 9 నుంచి 11 శాతానికి పెరిగింది.
పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు..
జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 3: వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకొని నగరంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంఎన్జే వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ జయలత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘క్లోజ్ ద కేర్ గ్యాప్’ నినాదంతో విజయనగర్ కాలనీ, ఖైరతాబాద్, యూసుఫ్గూడ, బంజారాహిల్స్ రోడ్ నంబర్.12 లోని పోచమ్మబస్తీల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎఫ్ఎంలో శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామన్నారు. ఖైరతాబాద్ డిగ్రీ, ప్రసాద్ ఐమ్యాక్స్లోనూ అవగాహన కార్యక్రమాలుంటాయని తెలిపారు.