మంచాల : కార్తీకపౌర్ణమి నుంచి ప్రారంభమైన బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర శనివారం అమావాస్యతో ముగిసింది. 15రోజుల పాటు జరిగిన జాతరలో వివిధ జిల్లాల నుంచి లక్షకు పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరకు అమావాస్య రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆ ప్రాంతమంత భక్తులతో కిటకిటలాడడమే కాకుండా శివనామ స్మరణతో మార్మోగింది. అమావాస్య కావడంతో ఉదయం 3 గంటల నుంచి భక్తులు దేవాలయానికి చేరుకోని కార్తీక స్నానాలు ఆచరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
అదే విధంగా స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి వ్రతాలు, శివలింగం, తులసికోట వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కబీర్దాస్ మందిరంలోని నాగన్న పుట్ట, నర్సింహ్మబాబా సమాదిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వన భోజనాలతో ఆనందంగా గడిపారు.