ఆమనగల్లు, ఏప్రిల్ 19 : కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీగార్డెన్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డితో కలిసి శుక్రవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు.
కాంగ్రెస్ను ప్రజలు నిలదీయాలన్నారు. రైతు రుణమాఫీని డిసెంబర్ 9న చెస్తామని చెప్పి మళ్లీ ఆగస్టు 15న మాఫీ చేస్తామనడం రైతులను మోసం చేయడమేనన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఉన్నత విద్యావంతుడని, గురుకులాల కార్యదర్శిగా పనిచేసి వేల మంది పేద విద్యార్థులను ఉన్నత ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేశారన్నారు. అలాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆమనగల్లులోని శ్రీ లక్ష్మీగార్డెన్లో నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హాజరవుతారని ఆయన తెలిపారు.
సమావేశంలో కడ్తాల్ జడ్పీటీసీ దశరథ్నాయక్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు అర్జున్రావు, నేనావత్ పత్యానాయక్, బీఆర్ఎస్ మాడ్గుల, కల్వకుర్తి మండలాల అధ్యక్షులు ఏమిరెడ్డి జైపాల్ రెడ్డి, సింగం విజయ్ గౌడ్, నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, లాలయ్యగౌడ్, సురమల్ల సుభాశ్, సురమల్ల సత్తయ్య, కొమ్ము ప్రసాద్, చలిచీమల సతీశ్, డేరంగుల వెంకటేశ్, లండం యాదయ్య, భాస్కర్, సుమన్ పాల్గొన్నారు.