పరిగి, జనవరి 29 : ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చాకలి రవి ఇటీవల మృతిచెందగా ఆయన భార్య రమాదేవికి రూ.2లక్షల బీమా చెక్కును సోమవారం కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా రవి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రవికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారని చెప్పగా వారి చదువుకు అండగా నిలుస్తామని, బాధపడరాదని సూచించారు. అంతకుముందు మీర్జాపూర్ గ్రామస్తులు పలువురిని కేటీఆర్ కలిసి మాట్లాడారు.
మీర్జాపూర్కు చెందిన మమత కుమారుడు తనీష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని తల్లి చెప్పగా.. వైద్య సహాయం అందించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. మీర్జాపూర్ గ్రామంలో పలువురు చిన్నారులు మొదలుకొని, పెద్దవారు సైతం కేటీఆర్తో సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం కారులో వెళ్తుండగా చిన్నారులు కేటీఆర్ను చూసేందుకు రావడంతో కారు ఆపించి ఓ చిన్నారిని కేటీఆర్ ఎత్తుకున్నారు.
అంతకుముందు మన్నెగూడలోని అతియా హోటల్లో కేటీఆర్ ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, మెతుకు ఆనంద్లతో కలిసి టీ తాగారు. ఈ సందర్భంగా పలువురు కేటీఆర్ను కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ గ్రామం నుంచి మెజార్టీ ఇవ్వనందుకు పార్టీ నాయకుడు శ్రీనివాస్ బాధపడగా ఓదార్చారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సీనియర్ నాయకులు అనిల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అజహరుద్దీన్, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.