ఇబ్రహీంపట్నం/ఆదిబట్ల, ఏప్రిల్ 12 : పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గంపుమేస్త్రికి గుణపాఠం చెబుదామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం బొంగుళూరు సమీపంలోని ప్రమిదగార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపీ సీట్ల కేటాయింపులో బీఆర్ఎస్ బలహీన వర్గాల వారికి పెద్ద పీట వేసిందన్నారు. అందులో భాగంగానే భువనగిరి స్థానంలో క్యామ మల్లేశ్కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆర్థిక ప్రగతితోనే సమానత్వం వస్తుందన్న జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ఆచరణలో చూపించారన్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో బడుగుబలహీన వర్గాలకు అభ్యున్నతికి కృషి చేసినట్లు తెలిపారు. 1008 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామన్నారు. కులవృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశామన్నారు. గొల్లకురుమల ఆర్థిక అభివృద్ధి కోసం 11 వేల కోట్లతో సబ్సిడీపై గొర్రెలు, రూ.35 వేల కోట్లతో మత్స్యకారులకు చేప పిల్లలను అందజేశామన్నారు. అలాగే అనేక సంక్షేమ పథకాలతో నేతన్నలకు అండగా నిలిచామన్నారు. వచ్చే ఎన్నికల్లో బడుగుబలహీన వర్గాలకు చెందిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, ఒకరిద్దరు అవకాశవాద నేతలు పార్టీని వీడినంతమాత్రాన జరిగే నష్టమేమిలేదన్నారు. స్థానికుడైన భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీజేపీకీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. రాముని పేరు చెప్పి ఓట్లు అడగడానికి వస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, దండే రాంరెడ్డి, జక్క రాంరెడ్డి, ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ, ఏర్పుల చంద్రయ్య, మంకు ఇందిర, మంద సురేశ్, ఆకుల యాదగిరి, కల్వకోలు రవీందర్రెడ్డి, పొట్టి శ్రీకాంత్, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గ రాములు, రమేశ్ గౌడ్, కిషన్గౌడ్, చీరాల రమేశ్, మున్సిపాలిటీ అధ్యక్షులు కొప్పు జంగయ్య, అల్వాల వెంకట్రెడ్డి, దామోదర్, కల్యాణ్నాయక్, అనితగౌడ్, సుకన్య, అశ్విని, లక్ష్మారెడ్డి, పాశ్చ భాష, భాస్కర్రెడ్డి, బహుదూర్నాయక్, జెర్కెని రాజు, మొద్దు అంజిరెడ్డి, అరవింద్ అప్ప, సింగిల్విండో చైర్మన్లు రాజేందర్రెడ్డి, మహేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గ్గొన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను గాలికొదిలేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. మరోసారి గారడీ మాటలతో మోసం చేసేందుకు గ్రామాలకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను చీపురుతో తరిమికొట్టాలి. బీఆర్ఎస్ను గెలిపించుకొని కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ఎంపీ ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది. క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కరెంట్ లేక, నీరు లేక పంటలు ఎండిపోతున్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడంలేదు. ఇలాంటి సర్కార్ తగిన గుణపాఠం చెప్పాలంటే బడుగుబలహీన వర్గాల బిడ్డ అయిన క్యామ మల్లేశ్ను గెలిపించుకోవాలి.
-ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం
భువనగిరి పార్లమెంటు అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన బీఆర్ఎస్కే ఓట్లు అడిగే హక్కు ఉన్నది. గతంలో ఎంపీగా ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది శూన్యం. ఈ నియోజకవర్గంలోని యదాద్రి ఆలయాన్ని అత్యధిక నిధులతో తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలిపిన ఘనత కేసీఆర్దే. బలహీన వర్గాలకు చెందిన నన్ను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా. ఎన్నికల్లో అవకాశవాద రాజకీయలతో పార్టీ మారిన బీజేపీ అభ్యర్థి, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి తగిన గుణపాఠం చెప్పాలి.
– క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి
కాంగ్రెస్ ప్రభుత్వం తీరు సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న చందంగా ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో అత్యధిక నిధులు తీసుకువచ్చి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రారంభించి.. వారు చేసిన ప్రగతి పనులంటూ చెప్పుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షించి బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసిన ఫార్మాసిటీ, ఫాక్స్కాన్ను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసింది.
-మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానంలో ఇదివరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికీ దక్కలేదు. ఈ సారీ బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేశ్కు దక్కింది. ఈ ప్రాంత ప్రజలంతా రాజకీయాలకతీతంగా కారుగుర్తుకు ఓటేసి ఎంతో రాజకీయ అనుభవం కలిగిన మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
-వంగేటి లక్ష్మారెడ్డి
ఎంపీ ఎన్నికల్లో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఎంపీ అభ్యర్థిగా పని చేయాలి. ఇబ్రహీంపట్నంపై ఎంతో ప్రేమతో కేసీఆర్ నియోజవర్గానికి చెందిన బడుగు బలహీన వర్గానికి ఎంపీ సీటు కేటాయించారు. ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకుందాం.
-మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి