వికారాబాద్, మే 17 : బండి సంజయ్ని కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఆయన మంత్రివర్గంలో ఉండొద్దన్నారు. బండి భగీరథ్ను మా ప్రభుత్వం అరెస్టు చేసిందని రేవంత్రెడ్డి చెబుతుంటే.. కాదు కాదు తానే లాయర్లను వెంటబెట్టి నా కొడుకును ఠాణాలో పోలీసులకు సరెండర్ చేసినట్టు బండి సంజయ్ పేర్కొంటున్నారన్నా రు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉండడంతోనే పోలీసులకు అప్పగించినట్టు ప్రగల్భాలు పలుకుతున్న ఆయన తొమ్మిది రోజులపాటు ఈ ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని గ్రహించే తప్పని పరిస్థితుల్లో కొడుకును అప్పగించిన మీకు మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.
పేదల నడ్డి విరిచారు..
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరించిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెల్లడి కాగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలపై పెట్రో భారం మోపిందని దుయ్యబట్టారు. ఈ పెంపు సామాన్యులకు పెను భారంగా మారందని.. నిత్యావసరాలు పెరిగి పేదలు జీవించలేని పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై.. వారి బాగోగులపై లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వాణిజ్య గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.