మహేశ్వరం, ఏప్రిల్ 28: వరుస చేరికలతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతున్నదని.. మరోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్డీతండా, దయాలగుండుతండాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు అంగోతు గోపాల్ నాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు రమావత్ గోపాల్నాయక్, ఉపసర్పంచ్ ఊర్మిలారవినాయక్, యూత్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో 200 మంది బీఆర్ఎస్లో చేరగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోని బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకూ అందుతున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతున్నదన్నారు.