కల్వకుర్తి, నవంబర్ 2 : రాజకీయ లబ్ధి కోసం రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రచార కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి వచ్చిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను గురువారం కల్వకుర్తిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఖండించారు. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడారు. జిల్లెళ్ల గ్రామంలో మూడు సంవత్సరాల క్రితం రైతు ఎగిరిశెట్టి చంద్రయ్య ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
గతంలో రెండుసార్లు చంద్రయ్య ఆత్మహత్య ప్రయత్నాలు చేశాడు. దురదృష్టవశాత్తు మూడోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు. చంద్రయ్యకు 28గుంటల పొలం ఉంది, రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. వ్యక్తిగత కారణాలతో చంద్రయ్య చనిపోతే మూడు సంవత్సరాల తరువాత కాంగ్రెస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం అప్పుల బాధతో చనిపోయాడని రాజకీయాలు చేస్తారా అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. చంద్రయ్య చనిపోయిన వారం రోజుల వ్యవధిలోనే బాధిత కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా వచ్చింది. చంద్రయ్య భార్య తిరుపతమ్మకు వితంతు పింఛన్ మంజూరైంది. మూడు సంవత్సరాలుగా చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించని ఏఐసీసీ, పీసీసీ, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
బాధిత కుటుంబానికి పది పైసలు కూడా సాయం అందించని కాంగ్రెస్ వాళ్లు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తారా అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలు కనిపించడం లేదా, కళ్ళుండి చూడలేని గుడ్డివాళ్లు అంటూ కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే దుమ్మెత్తిపోశారు. భారతదేశ అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహుల పార్టీ కాంగ్రెస్ అని, ఇలాంటి పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్పై అవాకులు చవాకులు పేలితే సహించమన్నారు.
సాంప్రదాయం, సిద్దాంతమంటూ లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి కుటుంబాల విలువ ఏం తెలుసని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వసుందని కలలు కంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బులతో బీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా కల్వకుర్తిలో బీఆర్ఎస్ విజయాన్ని ఏశక్తి అడ్డుకోలేదని ఎమ్మెల్యే చెప్పారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్దన్, కౌన్సిలర్లు సూర్యప్రకాశ్రావు, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు జంగయ్య, బీఆర్ఎస్ నాయకులు మనోహర్రెడ్డి, శ్రీనివాసులు, బాలయ్య చెన్నకేశవులు, కిషోర్రెడ్డి, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.