ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమం నుంచి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణకు అడుగడుగునా మోసమే జరిగిందని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవి ష్కరించి..అనంతరం జరిగిన సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణను ఆంధ్రలో కలిపి మొదటి మోసానికి తెరతీసిందే కాంగ్రెస్ పార్టీ అని..తొలి దశ ఉద్యమంలో 369మంది తెలంగాణ ఉద్యమకారులను కాల్చిచంపిందన్నారు.
పెద్దమనుషుల ఒప్పందం, ఫజల్అలీ కమిషన్ సిఫార్సులు, 610 జీవోలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ నాలుగు నెలల వ్యవధిలోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నదన్నారు. హామీలను నెరవేర్చకుండా.. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల గుండె చప్పుడని స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ వీడిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ, మండల పార్టీ అధ్యక్షులు బుగ్గరాములు, కిషన్గౌడ్, రమేశ్, రమేశ్గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు జంగయ్య, వెంకట్రెడ్డి, దామోదర్, కల్యాణ్నాయక్, రాంరెడ్డి, యాదగిరి, నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, జగదీశ్వర్, ప్రసాద్గౌడ్, రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.