రంగారెడ్డి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగా ణ) : జిల్లాలోని కొహెడలో ఏర్పాటు చేయనున్న పండ్ల మార్కెట్కు స్థలం కేటాయింపు విషయంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పండ్ల మా ర్కెట్ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభు త్వం 170 ఎకరాల స్థలాన్ని కేటాయించగా.. అందులో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. అయితే, అప్పట్లో వీచిన గాలివానకు ఆ షెడ్లు లేచిపోవడంతో వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. దీంతో కొహెడలో ఉన్న పండ్ల మార్కెట్ను బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కుకు తరలించారు.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొహెడలో శాశ్వతంగా పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలో పండ్ల మార్కెట్ కోసం తీసుకున్న సర్వేనంబర్ 507, 548లో గల 170 ఎకరాల్లో నిర్మించేందుకు డీపీఆర్ను సైతం సిద్ధం చేసింది. కానీ, గత మంత్రివర్గ సమావేశం లో మాత్రం ఈ స్థలాన్ని టీజీఐఐసీకి కేటాయించి, ఆ పక్కనే ఉన్న 167 సర్వేనంబర్లో గల సుమారు 200 ఎకరాల్లో పండ్ల మార్కెట్ను నిర్మిస్తామని ప్రకటించింది. కానీ, ఈ స్థలంలో 118 మంది రైతులకు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. రైతులు ఈ భూములను సాగు చేసుకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం ఈ భూమిని తీసుకునేందుకు ప్రయత్నించడంతో రైతులు కోర్టును ఆశ్రయించగా.. ఆ కేసు న్యాయస్థానంలో ఉన్నది. ప్రభుత్వం ఈ భూములను పండ్ల మార్కెట్కు కేటాయించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్డునపడనున్న 118 మంది రైతులు
కొహెడ పండ్ల మార్కెట్కు అనువైన స్థలాన్ని పక్కన పెట్టి వివాదంలో ఉన్న భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బాధిత రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో పండ్ల మార్కెట్ నిర్మాణం మరింత జాప్యం కానున్నది.
నేడు హరీశ్రావు రాక
కొహెడ పండ్ల మార్కెట్ స్థలంపై కొనసాగుతున్న వివాదంతోపాటు బాధిత రైతులతో మాట్లాడేందుకు సోమవారం ఉద యం శాసనసభా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావుతోపాటు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి రానున్నారు. పండ్ల మార్కెట్కు అనువైన స్థలమున్నా వివాదాస్పద స్థలా న్ని తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఈ సందర్భంగా వారు రైతుల స్థలాలను పరిశీలించడంతోపాటు వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకోనున్నారు.